బాబు 2.O..కర్నూలులో తేల్చేశారు..!

రాజకీయాలు ఇప్పుడు చాలా మారిపోయాయి..పాలసీ పరంగా విమర్శలు చేసుకోవడం పోయింది..వ్యక్తిగతంగా విమర్శలు చేయడం మొదలైంది. ప్రత్యర్ధులని దెబ్బతీయడానికి వారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి బూతులు తిట్టడం ఎక్కువైంది. వ్యక్తిగతమైన విమర్శల దాడి టీడీపీ హయాంలోనే మొదలైంది..ఇక వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంతో పాటు బూతులు తిట్టడం వైసీపీ అధికారంలోకి వచ్చాక మొదలైంది..అది ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది.

చంద్రబాబు, పవన్, లోకేష్‌లని వైసీపీ నేతలు ఏ రేంజ్‌లో తిట్టారో చెప్పాల్సిన పని లేదు..ఇక వారికి కౌంటరుగా టీడీపీ, జనసేన నేతలు కూడా తిట్టడం మొదలుపెట్టారు. కాకపోతే చంద్రబాబు, పవన్‌లు ఫైర్‌తో మాట్లాడేవారు తప్ప..తిట్టడం చేయలేదు..కానీ విశాఖ ఘటన తర్వాత పవన్…వైసీపీ నేతలని టార్గెట్ చేసి ఓ రేంజ్‌లో ఏకిపారేశారు. అటు యథావిధిగా వైసీపీ నేతలు బూతులతో పవన్‌పై విరుచుకుపడ్డారు.

ఇక ఇప్పుడు బాబు వంతు వచ్చింది..కర్నూలు జిల్లా పర్యటనలో తనదైన శైలిలో వైసీపీపై విరుచుకుపడ్డారు. ఏదో గతంలో మాదిరిగా ఉపన్యాసాలు చెప్పకుండా వైసీపీ విధానాలపై విరుచుకుపడ్డారు. బాబు పర్యటనకు జనం నుంచి భారీ స్పదన కూడా వచ్చింది. అయితే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని కొందరు నిరసనలు తెలియజేశారు. బాబు పర్యటనని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో బాబు వారిపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. . వారంతా పేటీఎం బ్యాచ్‌ అని, వైఎస్సార్‌ పార్టీ గూండాలని విరుచుకుపడ్డారు. ‘చేతగాని దద్దమ్మల్లారా.. నేరాలు, ఘోరాలు చేసే దుర్మార్గుల్లారా.. ఎంత ధైర్యం మీకు? మా ఇంటికి వస్తారా.. మా ఆఫీసుకు వస్తారా.. మీ అంతు చూస్తా..’ అని ఫైర్ అయ్యారు.

ఇక ఆనాడు జగన్ అమరావతికి ఓకే చెప్పినప్పుడు ఈ పేటీఏం బ్యాచ్ ఏమయ్యారని, మూడు రాజధానుల పేరుతో మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని, రాయలసీమని అభివృద్ధి చేసింది తానని, కర్నూలుకు హైకోర్టు బెంచ్ ప్రతిపాదించనని, ఎయిర్‌పోర్టు, సోలార్ పార్క్, ఉర్దూ యూనివర్సిటీ లాంటివి తీసుకొచ్చానని అన్నారు. మొత్తానికి వైసీపీ టార్గెట్ గా బాబు తన ఫైర్ ఏంటో చూపించారు..అలాగే ప్రతి విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా చెప్పేశారు. ఏదేమైనా బాబు వర్షన్ మారిందనే చెప్పొచ్చు.