బడా పత్రిక సర్వే..బాబుకు క్లారిటీ..!

ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నా సరే…ఇప్పటినుంచే రాష్ట్రంలో ఎన్నికల సందడి కనిపిస్తోంది..ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ-టీడీపీలు ముందుకెళుతున్నాయి. రకరకాల వ్యూహాలతో పార్టీలు వెళుతున్నాయి..అలాగే ఇప్పటినుంచే అభ్యర్ధులని ఎంపిక చేసే ప్రక్రియ కూడా మొదలుపెట్టేశారు. ఇక ఎవరికి వారు సొంతంగా సర్వేలు నిర్వహించుకుంటున్నారు. అలాగే థర్డ్ పార్టీ సంస్థలు కూడా సర్వేలు చేస్తున్నాయి.

ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద మీడియా, పత్రిక వ్యవస్థ కలిగిన ఈనాడు సంస్థ ఒ సర్వే చేసిందని ప్రచారం వస్తుంది. ఇటీవల రామోజీరావుతో చంద్రబాబు భేటీ అయ్యారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ భేటీలో ఓ సర్వే రిపోర్టుని బాబుకు అందించారని సమాచారం. ఆ సర్వే ప్రకారం..సింగిల్‌గా పోటీ చేస్తే వైసీపీదే పైచేయి అవుతుందని, అదే టీడీపీ-జనసేన కలిస్తే వైసీపీని నిలువరించవచ్చని తేలిందట. గత ఎన్నికల్లో జనసేన వల్ల దాదాపు 30 పైనే సీట్లలో ఓట్లు చీలిపోయి టీడీపీకి నష్టం జరిగింది.

ఈ సారి  ఆ ఓట్ల చీలిక భారీగా ఉంటుందని తేలిందట. రాష్ట్రంలో పవన్ బలం పెరుగుతుందని, ఒకవేళ పవన్ సింగిల్ గా పోటీ చేస్తే 50 సీట్లలో ఓట్ల చీలిక ఉంటుందని,దీని వల్ల టి‌డి‌పికి నష్టమని, కాబట్టి జనసేనని కలుపుకుని వెళితే బెటర్ అని బాబుకు సూచించారట.  అయితే ఆ సర్వే ఎంతవరకు నిజమో క్లారిటీ లేదు. ఎందుకంటే ఈనాడు సంస్థ ఇలాంటి సర్వేలు చేయదు..కాకపోతే రాష్ట్రంలోని పరిస్తితులపై నివేదికలు ఇస్తుంది.

రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడుకు మండల స్థాయి నుంచి నెట్‌వర్క్ ఉంది. ఆ నెట్‌వర్క్ ద్వారా…ఆయా స్థానాల్లో పరిస్తితులు అంచనా వేయవచ్చు. అలాంటి నివేదిక వచ్చి ఉండాలి..కాకపోతే ఈ నివేదికలు నిజమనేది చెప్పలేం. కానీ రాష్ట్రంలో పరిస్తితులు అలాగే ఉన్నాయి..సింగిల్ గా పోటీ చేస్తే వైసీపీదే లీడ్. టీడీపీ-జనసేన కలిస్తే వైసీపీకి రిస్క్.