ఆ టీడీపీ ఎమ్మెల్యేలకు వైసీపీ ఇంచార్జ్‌లతో టఫ్ ఫైట్..!

ఈ సారి 175కు 175 సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా జగన్ పనిచేస్తున్న విషయం తెలిసిందే..కుప్పంతో సహ అన్నీ సీట్లు గెలుచుకోవాలని జగన్ టార్గెట్‌గా పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ గెలుచుకున్న 23 సీట్లని కూడా లాగేసుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న స్థానాల్లో బలమైన వైసీపీ నేతలకు ఇంచార్జ్‌ పదవి ఇచ్చారు. ఆ ఇంచార్జ్‌లు కూడా దూకుడుగా పనిచేస్తున్నారు. పైగా అధికారంలో ఉండటంతో..వారే ఎమ్మెల్యేల మాదిరిగా నియోజకవర్గాల్లో పనిచేస్తున్నారు.

పైగా వైసీపీ అధిష్టానం ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇంచార్జ్‌లే ముందు వరుసలో ఉన్నారు. తాజాగా జగన్ గడపగడపకు ప్రోగ్రాంని సరిగ్గా నిర్వహించని వారికి క్లాస్ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే బాగా పనిచేసే వారిని ప్రశంసించారు. అయితే తాజాగా గడపగడపకు కార్యక్రమలో ఇద్దరు ఇంచార్జ్‌లు టాప్‌లో నిలిచారు.

పర్చూరు నియోజకవర్గానికి చెందిన రావి రామనాథంబాబు ఇప్పటివరకు 110 రోజులు గడపగడపకు తిరిగి ఫస్ట్ ప్లేస్‌లో నిలిచారు..ఆ తర్వాత పెద్దాపురం ఇంచార్జ్ దవులూరు దొరబాబు 102 రోజులతో సెకండ్ ప్లేస్‌లో నిలిచారు. ఈ ఇద్దరు ఇంచార్జ్‌లు ప్రజల్లో ఎక్కువ తిరుగుతున్నారు. మరి ఇలా ప్రజల్లో ఎక్కువ తిరుగుతున్న ఈ ఇంచార్జ్‌లు వల్ల ఆయా నియోజకవర్గాల్లోనే టీడీపీ ఎమ్మెల్యేలకు ఏమైనా రిస్క్ ఉంటుందా? అంటే కాస్త ఉండే అవకాశాలు లేకపోలేదు.

పర్చూరులో టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, పెద్దాపురంలో నిమ్మకాయల చినరాజప్ప ఉన్నారు. ఈ ఇద్దరికీ వైసీపీ ఇంచార్జ్‌లు గట్టి పోటీ ఇస్తున్నారు. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే..ఈ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత లేదు..పైగా వీరికి ప్రజల మద్ధతు ఎక్కువగానే ఉందని తాజా సర్వేల్లో తేలింది. అలా అని వైసీపీ ఇంచార్జ్‌లని తేలికగా తీయకుండా ఇంకా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. అప్పుడే వైసీపీ ఇంచార్జ్‌లకు చెక్ పెట్టగలుగుతారు.