రాష్ట్ర అధికార పార్టీ వైసీపీ వ్యవహరిస్తున్న తీరు.. అనేక అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. రాజధాని విషయం.. ఇప్పుడు ఆమూలాగ్రం చర్చకు వస్తోంది. ఒకవైపు.. రాజధాని రైతులు మహాపాదయాత్ర 2.0ను ప్రారంభించారు. కేంద్రం రాజధానిపై చర్చిద్దాం.. రమ్మని పిలుపునిచ్చింది. మూడు రాజధానులు కాదు.. ఒకే రాజధాని అని.. రాష్ట్ర హైకోర్టు తేల్చి చెప్పింది. దరిమిలా.. మూడు రాజధానులకే తమ మొగ్గు అంటూ.. మంత్రులు, నాయకులు.. ప్రకటనలు ఇస్తున్నారు.
ఈ పరిణామాలను గమనిస్తే.. వైసీపీ ప్రభుత్వం.. ఏం చేస్తుంది? మరో ఏడాదిన్నర సమయం ఉన్న నేప థ్యంలో అసలు మూడు రాజధానులను నిర్మిస్తుందా.? లేక.. ఒకే రాజధానిని డెవలప్ చేస్తుందా? అనేది ఆసక్తిగా మారింది. అయితే.. వైసీపీ వ్యూహం వేరేగా ఉందని అంటున్నారు పరిశీలకులు. అదేంటంటే.. ఇప్పటికిప్పుడు.. అమరావతిని డెవలప్ చేయడం.. చేస్తున్నట్టు వ్యవహరిస్తుంది. అదే సమయంలో మూడు రాజధానులకు కూడా న్యాయ సంబంధిత అంశాల్లో పరిష్కారం రావాల్సి ఉంది.
ఇవి రావడానికి సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో వచ్చే దసరా నుంచి సీఎం జగన్ తన నివాసాన్ని.. విశాఖకు మార్చుకుని.. అక్కడి నుంచి పాలన ప్రారంభిస్తారు. దీనిని ఎవరూ తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఆయన ఎక్కడి నుంచైనా పాలన సాగించేందుకు ఇబ్బంది లేదు. దీంతో అనధికారికంగా.. విశాఖ రాజధాని అయినట్టేనని వైసీపీలో ఓ వర్గం చర్చిస్తోంది. ఇక, ప్రస్తుతం విశాఖలో రాజధాని సెంటిమెంటు అంతంత మాత్రంగానే ఉందనేది వైసీపీ భావిస్తోంది.
ఈ క్రమంలో నేరుగా సీఎం విశాఖలోనేకూర్చుంటే.. అప్పుడు సెంటిమెంటు బలపడే అవకాశం ఉంటుంది . ఇలా.. వచ్చే ఎన్నికల వరకు .. విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి.. మూడు రాజధానులపై ప్రజల్లో సదభి ప్రాయం.. సెంటిమెంటును రెచ్చగొట్టేందుకు వినియోగించుకోవాలనే భావన వ్యక్తమవుతోంది. అప్పుడు.. ఎలానూ ఎన్నికలు వస్తాయి కాబట్టి.. మూడు రాజధానుల విషయాన్ని.. ప్రజల్లో పెట్టి.. అవసరమైతే.. మేనిఫెస్టోను కూడా రూపొందించి.. మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామనే దిశగా ప్రజలను ఒప్పించి.. ఎన్నికలకు వెళ్లే ప్రయత్నం చేస్తోందని అంటున్నారు.
దీనివల్ల.. ఎలాంటి ఇబ్బందీ లేకుండా.. పార్టీ గెలుపు గుర్రం ఎక్కే అవకాశం ఉంటుందని.. అంటున్నారు. అంటే.. ఇప్పటి వరకు కేవలం.. వైసీపీ నేతలకే పరిమితం అయిన మూడు రాజధానుల అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లి సెంటిమెంటును మరింత రాజేయాలనేది.. వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇక, అమరావతిలో చిన్నపాటినిర్మాణాలు చేపట్టడం.. మినహా.. ఇప్పట్లో ఏమీచేయాలని భావించడం లేదని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు పోయినా.. (రాజధాని ఎఫెక్ట్తో) తమకు ఇబ్బంది లేదని .. భావిస్తున్నట్టు సమాచారం. మరి ఈ వ్యూహం ఏమేరకు సక్సెస్ అవుతుందోచూడాలి.