పవన్ లెక్కలు: వైసీపీకి 45..మరి జనసేనకు?

ప్రజా సమస్యలపై తనదైన శైలిలో పోరాటం చేయడం, ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం..రాజకీయంగా ప్రత్యర్ధులపై ఫైర్ అవ్వడం..ఇదే పవన్ చేసే కార్యక్రమం. కాకపోతే ఇది కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. ఎక్కువ సమయం సినిమాలకు కేటాయిస్తూ..అప్పుడప్పుడు రాజకీయాలు చేస్తూ ఉంటారు. దీని వల్ల జనసేన పార్టీ పెద్దగా బలపడలేదు. అలాగే పవన్..ఎప్పుడు పెద్దగా సర్వేల గురించి మాట్లాడటం చేయరు.

తమకు ప్రజలు మద్ధతు ఇవ్వాలని కోరతారు, అలాగే వైసీపీని ఓడించాలని అడుగుతారు తప్ప..ప్రత్యేకంగా తమకు ఇన్ని సీట్లు వస్తాయి…వైసీపీకి అన్నీ సీట్లు వస్తాయి..టీడీపీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందనే విషయాన్ని ఎప్పుడు పెద్దగా చెప్పరు. కానీ తాజాగా పవన్ సర్వేలు అని మాట్లాడారు.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 45 నుంచి 67 స్థానాలకే పరిమితం కాబోతోందని, రాజకీయ నిపుణుల అధ్యయనాలు, సర్వే రిపోర్టుల ప్రకారం ఆ పార్టీకి వచ్చే సీట్లు అవేనని.. జనసేన బలంగా పుంజుకుంటుందని, పార్టీ నాయకులు, శ్రేణులు ఎన్నికలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.

సరే వైసీపీకి అవే సీట్లు వస్తాయని చెప్పారు..మరి జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయి…మరి టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయనేది మాత్రం చెప్పలేదు. ఇక్కడ మళ్ళీ వైసీపీ గెలవదని స్పష్టంగా చెప్పేస్తున్నారు. అదే సమయంలో జనసేన గెలిచి అధికారంలోకి వస్తుందని మాత్రం చెప్పడం లేదు. జనసేన బలపడుతుందని అంటున్నారు గాని…ఎన్ని సీట్లు గెలుస్తుందో చెప్పడం లేదు.

అంటే ఇక్కడ టీడీపీకే ఎక్కువ సీట్లు వస్తాయని పవన్ పరోక్షంగా చెబుతున్నట్లు కనిపిస్తున్నారు. అలాగే టీడీపీతో కలిసే పొత్తులో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారని అర్ధమవుతుంది. అప్పుడు రెండు పార్టీలు కలిసి మెజారిటీ సీట్లు గెలుచుకుని అధికారంలోకి వస్తామని పవన్ పరోక్షంగా క్లారిటీ ఇస్తున్నారు. మొత్తానికైతే పవన్..జనసేన బలోపేతం కంటే..టీడీపీతో పొత్తు పట్ల ఎక్కువ ఆసక్తిగా ఉన్నట్లు అర్ధమవుతుంది.