రిస్క్‌లో కరణం వారసుడు..చీరాల డౌటే..!

ఏపీ రాజకీయాల్లో కరణం బలరాం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. చంద్రబాబు సమకాలికుడుగా పనిచేస్తూ వచ్చిన కరణం..అనూహ్యంగా బాబుకు దూరమయ్యారు. 2019 ఎన్నికల్లో చీరాల నుంచి గెలిచి..వైసీపీలోకి జంప్ కొట్టారు. సరే అధికార పార్టీలో ఉన్నారు..అంతా బాగానే ఉందని అనుకోవచ్చు. మిగతా విషయాల్లో బాగానే ఉందేమో గాని..రాజకీయంగా మాత్రం కరణంకు కాస్త ఇబ్బందులు ఉన్నాయి.

ప్రస్తుతానికి చీరాల ఎమ్మెల్యేగా కరణం ఉన్నారు…ఆయన వారసుడు చీరాల ఇంచార్జ్‌గా ఉన్నారు. మరి ఇంకేంటి నెక్స్ట్ చీరాల సీటు కరణం వారసుడుకే అని అనుకోవచ్చు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది..చీరాలలో రాజకీయంగా కరణం వారసుడుకు చాలా రిస్క్ ఉంది. మొదట ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌తో కరణం ఫ్యామిలీ పడటం లేదు. మొదట నుంచి రెండు వర్గాల మధ్య రచ్చ జరుగుతుంది. అటు ఆమంచి సైతం చీరాల సీటు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అలాగే చీరాలలో ఉన్న ప్రధాన నాయకులు పోతుల సునీత, పాలేటి రామారావులతో కూడా కరణం ఫ్యామిలీకి గ్యాప్ ఉంది.

2019 ఎన్నికల్లో కరణం గెలుపుకు వీరు కృషి చేశారు. కానీ వైసీపీలోకి వచ్చాక వీరిలో వీరికే పడటం లేదు. అన్నిటికంటే పెద్ద ఇబ్బంది ఏంటంటే…అద్దంకిలో ఉన్నట్లు..చీరాలలో కరణంకు సొంత వర్గం అనుకున్నంత స్థాయిలో లేదు. ఇదే కాదు..టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన కరణం..వల్లభనేని వంశీ మాదిరిగా..చంద్రబాబుని గాని, లోకేశ్‌ని గాని తిట్టడం లేదు. అటు కరణం వారసుడు కూడా అంతే. అంటే ఇప్పటివరకు టీడీపీలో పనిచేసి వచ్చారు..పైగా చంద్రబాబుతో సన్నిహితంగా ఉన్నారు. అందుకే వారిని తిట్టడం కాదు కదా..కనీసం విమర్శించడం లేదు.

ఇటీవల కరణం వెంకటేష్..ఏదో మొక్కుబడిగానే బాబు, లోకేష్‌లపై విమర్శలు చేశారు. అలాగే అధిష్టానం ఆదేశిస్తే చీరాలలో పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. కానీ చీరాల టికెట్ ఇవ్వడానికి అనుకూల పరిస్తితులు లేవు..స్థానిక నేతలతో విభేదాలు, వైసీపీ కేడర్‌ని పూర్తిగా కలుపుకోకపోవడం, అన్నిటికి మించి చంద్రబాబుని తిట్టకపోవడం..ఈ పరిస్తితులని బట్టి చూస్తుంటే చీరాల సీటు కరణం వారసుడుకు వచ్చేలా లేదు.