క్యాపిటల్ గేమ్: ఎవరి ఆట వారిదే..!

ఏపీకి రాజధాని విషయంలో పార్టీలన్నీ పెద్ద పోలిటికల్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం వారు ఈ క్యాపిటల్ గేమ్‌ని ఆడుతున్నారని చెప్పొచ్చు. ఇలా రాజధానిపై రాజకీయం చేస్తూ…చివరికి రాష్ట్రానికి అంటూ ఒక రాజధాని అనేది లేకుండా చేస్తున్నారు. దీని వల్ల ప్రజలు నష్టపోయేలా ఉన్నారు. అధికార వైసీపీ ఏమో మూడు రాజధానులు అంటుంది..ప్రతిపక్ష టీడీపీ ఏమో అమరావతి అంటుంది.

కానీ ఇందులో ఏది సరిగ్గా రాజధాని ఏదో ఎవరికి తెలియడం లేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఈ క్యాపిటల్ గేమ్ మరింత తీవ్రమవుతుంది. ఎవరికి వారు రాజకీయం చేస్తూ..రాజధాని విషయంలో రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారు. అయితే అమరావతి కోసం ఆ ప్రాంత రైతులు, ప్రజలు దాదాపు మూడేళ్ళ నుంచి ఉద్యమం చేస్తున్నారు. వీరి ఉద్యమంలో నిజాయితీ ఉండొచ్చు గాని…ఆ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే అమరావతికి దగ్గర ఉన్న జిల్లాల్లో కలిసొస్తుందని టీడీపీ భావిస్తుంది.

అలాగే అమరావతికి రాష్ట్రం మొత్తం సపోర్ట్ చేసేలా ప్లాన్ కూడా చేశారు. ఇప్పటికే రాజధాని రైతులు పాదయాత్ర ద్వారా తిరుపతికి వెళ్లారు. ఇప్పుడు శ్రీకాకుళంలోని అరసవెల్లికి వెళుతున్నారు. దీంతో ఉత్తరాంధ్ర మద్ధతు కూడా దక్కుతుందని చూస్తున్నారు. ఇక మూడు రాజధానులు అని చెప్పి వైసీపీ గేమ్ నడుపుతుంది. మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం మూడు రాజధానులు అని చెప్పి మూడేళ్లు అవుతుంది. కానీ అతి గతి లేదు.

ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రాజకీయ లబ్ది పొందాలనేది వైసీపీ కాన్సెప్ట్..ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అభివృద్ధి కోసమని అంటున్నారు గాని ఇందులో రాజకీయ లబ్ది లేకుండా లేదు. ఇప్పుడు ఉత్తరాంధ్రలో అమరావతి పాదయాత్ర జరిగితే అసలుకే మోసం వస్తుందని చెప్పి..ఆ యాత్రని అడ్డుకుంటామని వైసీపీ నేతలు అంటున్నారు. ఇక రాజధాని రగడని సరిచేయాల్సిన కేంద్రం ఏమో పెద్దగా పట్టించుకోవడం లేదు. పైగా రాష్ట్ర బీజేపీ నేతలు ఏమో అమరావతి ఒకే రాజధాని అంటున్నారు. మొత్తానికి రాజధాని విషయంలో ఎవరి ఆట వారు ఆడుతున్నారు.