కాల్వ-పల్లెకు కష్టాలు..మళ్ళీ డౌటే?

తెలుగుదేశం పార్టీలో కాల్వ శ్రీనివాసులు, పల్లె రఘునాథ్ రెడ్డి…ఈ ఇద్దరు నేతలు చాలా సీనియర్లు. దశాబ్దాల కాలం నుంచి అనంతపురం రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇద్దరు నేతలు టీడీపీకి ఎప్పుడు సపోర్ట్‌గా ఉంటూ వస్తారు. ఇద్దరు నేతలు కూడా చంద్రబాబుకు సన్నిహితులే. అయితే ఇలా టీడీపీలో సీనియర్లుగా ఉన్న ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయి పోరాడుతున్న ఈ ఇద్దరు నేతలకు మళ్ళీ గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని…తాజాగా వస్తున్న సర్వేల్లో తేలింది.

2014 ఎన్నికల్లో కాల్వ-రాయదుర్గం నుంచి, పల్లె-పుట్టపర్తి నుంచి గెలిచి చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రులుగా కూడా పనిచేశారు. కానీ 2019 ఎన్నికల్లో వైసీపీ వేవ్‌లో ఇద్దరు నేతలు దారుణంగా ఓడిపోయారు. రాయదుర్గంలో కాల్వపై కాపు రామచంద్రారెడ్డి, పుట్టపర్తిలో పల్లెపై శ్రీధర్ రెడ్డి గెలిచారు. అయితే రాష్ట్రంలో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది..అలాగే టీడీపీ నేతలు పుంజుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో సీనియర్లు అయిన కాల్వ, పల్లెలు మాత్రం పూర్తి స్థాయిలో పుంజుకున్నట్లు కనిపించడం లేదు.

వాస్తవానికి పుట్టపర్తిలో శ్రీధర్‌కు గాని, రాయదుర్గంలో కాపుకు పూర్తి స్థాయిలో పాజిటివ్ ఏమి లేదు. అదే సమయంలో కాల్వ, పల్లె బాగానే కష్టపడుతునారు. కాకపోతే పూర్తి స్థాయిలో కష్టపడుతున్నట్లు కనిపించడం లేదు. పైగా రెండు నియోజకవర్గాల్లో వైసీపీ క్యాడర్ బలం పెరిగింది. దీంతో రెండు చోట్ల టీడీపీ గెలుపు కష్టమని తాజాగా ఆత్మసాక్షి సర్వేలో తేలింది.

ఇలా అనంతపురం జిల్లాలో ఇద్దరు సీనియర్లు గెలవకపోతే టీడీపీకి చాలా ఇబ్బంది. అయితే ఎన్నికలనాటికి ఏమైనా పరిస్తితి మారుతుందేమో చూడాలి. ఇక్కడ రాయదుర్గం పక్కన పెడితే…పుట్టపర్తి టీడీపీలో గ్రూపు తగాదాలు ఉన్నాయి. ఇక్కడ జేసీ ఫ్యామిలీ జోక్యం చేసుకుంటుంది. అలాగే ఓ యువ నేతని ముందు పెట్టి పల్లెకు చెక్ పెట్టాలని చూస్తున్నారు. దీంతో పుట్టపర్తి టీడీపీ రెండు గ్రూపులుగా విడిపోయింది. దీని వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది. మొత్తానికైతే ఇద్దరు సీనియర్లు కష్టాల్లోనే ఉన్నారు.