వైసీపీలో జంపింగుల గోల…రెడ్లే మెయిన్!

ఈ మధ్య అధికార వైసీపీలో జంపింగుల కలకలం చెలరేగింది…వైసీపీని కొంతమంది ఎమ్మెల్యేలు వీడొచ్చని ప్రచారం జరుగుతుంది..సాధారణంగా అధికార పార్టీ నుంచి ఎవరు బయటకు వెళ్లాలని అనుకోరు..అయితే ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో కొందరు ఎమ్మెల్యేలు తమ దారి తాము చూసుకునే పనిలో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. అది కూడా వైసీపీకి అండగా ఉండే రెడ్డి ఎమ్మెల్యేలపైనే పుకార్లు షికారు చేస్తున్నాయి.

ఇటీవల కాలంలో పలువురు రెడ్డి ఎమ్మెల్యేలు వైసీపీని వీడొచ్చని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి ఎన్నికల సమయంలో పార్టీ మారిపోతారని కథనాలు వస్తున్నాయి. కానీ ఆయన మాత్రం పార్టీని వీడేది లేదని అంటున్నారు. ఇక ఆ మధ్య కరుడుకట్టిన వైసీపీ అభిమానిగా ఉన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సైతం పార్టీని వీడతారని వార్తలు వచ్చాయి. సొంత పార్టీలోనే కొందరు నేతలు..తనని ఇబ్బంది పెడుతున్నారని కోటంరెడ్డి మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన వైసీపీని వీడొచ్చని ప్రచారం జరిగింది.

ఇక జగన్ దగ్గర బంధువైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సైతం జనసేనలోకి వెళ్లబోతున్నారని కథనాలు వచ్చాయి. తాజాగా పవన్ విసిరిన చేనేత వస్త్రాల ఛాలెంజ్ ని బాలినేని స్వీకరించి..చేనేత దుస్తులు ధరించారు. ఇంకా అంతే ఆయన వైసీపీని వీడుతున్నారని ప్రచారం వచ్చింది. చివరికి ఆయన డైరక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టి ప్రాణం పోయే వరకు వైసీపీని వీడనని చెప్పాల్సి వచ్చింది.

ఇక గడప గడపకు కార్యక్రమంలో అట్టడుగు స్థానంలో ఉన్న కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సైతం ఈ మధ్య సైలెంట్ గా ఉంటున్నారు..దీంతో ఆయన కూడా జంప్ అయిపోతున్నారని ప్రచారం మొదలైంది. తాజాగా ఆయన కూడా పార్టీ మార్పుపై వివరణ ఇవ్వాల్సి వచ్చింది..చివరి వరకు జగన్ తోనే నడుస్తానని చెప్పారు. అసలు రెడ్డి ఎమ్మెల్యేలే జంప్ అవుతారనే ప్రచారం ఎందుకు వస్తుందనేది క్లారిటీ లేదు.