తెలుగు సినీ పరిశ్రమ హవా కొనసాగుతుందనే చెప్పుకోవాలి. గత కొన్నాళ్ళనుండి వరుస డిజాస్టర్స్తో సతమతమవుతున్న టాలీవుడ్ కి బింబిసార, సీతారామం, కార్తికేయ 2 చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ని అందించి సత్తా చాటాయి. వీటిలో ముఖ్యంగా కార్తికేయ 2 నార్త్ లో కూడా దుమ్ముదులిపింది. అదే ఉత్సాహంతో విడుదలైన కొన్ని చిత్రాలు నిరుత్సాహపరిచాయి. తాజాగా పాన్ ఇండియా సినిమాగా రిలీజైన లైగర్ సినిమా బాక్షాఫీస్ వద్ద చతికలపడింది. ఇకపోతే ఈ వారం (సెప్టెంబర్ నెలారంభం)లో అటు థియేటర్లో ఇటు ఓటీటీలో అలరించడానికి పలు సినిమాలు విడుదల అయ్యాయి. ఇంకా విడుదల అవ్వడానికి కొన్ని సిద్ధంగా వున్నాయి. అవేమిటో ఒకసారి చూద్దాము.
మొదట థియేటర్లో రిలీజవ్వబోతున్న సినిమాల గురించి మాట్లాడుకుంటే.. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన లెటెస్ట్ చిత్రం ‘రంగ రంగ వైభవంగా’ రిలీజుకి సిద్ధమయ్యింది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రసార కార్యక్రమాలు షురూ చేసింది. బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 2న రిలీజ్ కానుంది. అలాగే తమిళ స్టార్ చియాన్ విక్రమ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కోబ్రా’. దర్శకుడు ఆర్ అజయ్ జ్ఞానముత్తు ఈ యాక్షన్ థ్రిల్లర్కు దర్శకత్వం వహించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ వినాయక చవితి కానుకగా ఆగస్ట్ 31న థియేటర్స్లో విడుదల కానుంది.
అలాగే సునీల్, ధన్రాజ్ హీరోలుగా ‘గరుడ వేగ’ అంజి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బుజ్జీ కూడా సెస్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక OTTల విషయానికొస్తే… అమెజాన్ ప్రైమ్ లో ‘ద లార్డ్ ఆఫ్ రింగ్స్’ (వెబ్ సిరీస్ తెలుగు) సెప్టెంబర్ 2న విడుదల కాబోతోంది. అలాగే మన అల్లువారి OTT ఆహాలో ‘పంచతంత్ర కథలు’ (తెలుగు) ఆగస్ట్ 31న రిలీజవ్వబోతోంది. ఇందులోనే ‘పెళ్లి కూతురు పార్టీ’ (తెలుగు) కూడా ఆగస్ట్ 31న రాబోతోంది. ఇక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో కఠ్పుత్లీ(హిందీ) సెప్టెంబర్ 2న రిలీజుకి సిద్ధంగా వుంది.