ఏ పార్టీ అయినా.. ప్రభుత్వంలోకి రావాలంటే..సంస్థాగతంగా పుంజుకోవాలి. ముఖ్యంగా .. క్షేత్రస్థాయిలో జెండా మోసే నాయకుడి నుంచి జైకొట్టే కార్యకర్త వరకు బలంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే.. పార్టీలు ఏవైనా.. కూడా సభ్యత్వ నమోదుకు ప్రాధాన్యం ఇస్తాయి. అదేసమయంలో యువతను ఎక్కువగా ప్రోత్సహించి.. వారిని బూత్ లెవిల్లో నియమిస్తాయి. అదేసమయంలో గ్రామాలు.. వార్డులు.. పంచాయతీలు.. కార్పొరేషన్ల పరిధిలో పార్టీని బలోపేతం చేస్తాయి.
ఇవన్నీ కూడా.. ఏ పార్టీకైనా..పునాదుల వంటివి ఈ పునాదుల బలం మీదే.. సదరు పార్టీ ప్రభుత్వంలోకి వస్తుందో.. రాదో చెప్పేయొచ్చు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితినే.. జనసేన ఎదుర్కొంటోంది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని.. పవన్ చెబుతున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీలకుండా చూస్తానని అంటున్నారు. మంచిదే..ఆయన నిర్ణయం ఆయనకు ఉండొచ్చు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమని స్తే.. అలా కనిపించడం లేదు. పైగా.. ఈ మూడేళ్ల కాలంలో రాష్ట్రంలో కీలకమైన ఎన్నికలు జరిగాయి.
గ్రామ పంచాయతీలు, కార్పొరేషన్లకు.. ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో జనసేన పోటీకి దూరంగా ఉంది. ఎవరో.. తమకు నచ్చిన వారు.. జనసేన జెండా పెట్టుకుని..పోటీచేశారు. గెలిచినవారు గెలిచారు. ఓడిన వారు ఓడారు. ఈ ప్రయత్నంలో జనసేనాని ప్రమేయం ఇసుమంతైనా లేదనేది వాస్తవం. దీంతో క్షేత్రస్థా యిలో తమకు ఆదరణ లేదని.. తమను పట్టించుకునేవారు లేరని.. జనసేన నాయకులు భావిస్తున్నారు. దీనికితోడు సభ్యత్వంపైనా..ఇప్పటి కీ క్లారిటీ లేదు.
ఈ పరిణామాలు కనుక సజావుగా సాగి ఉంటే.. పార్టీకి ఎక్కడికక్కడ పునాదులు బలంగా ఉండేవి. నాయకులు గెలిచారా..ఓడారా? అనేది పక్కన పెడితే.. నాయకులు ఉన్నారనే విషయం ప్రధానంగా చర్చకు వచ్చేది. పైగా.. తిరుపతి పార్లమెంటు కానీ.. నెల్లూరు ఉప ఎన్నిక, బద్వేలు ఉప ఎన్నికల్లో కానీ.. జనసేనెక్కడా పోటీ చేయలేదు. ఇలాంటి పరిణామాలు..పార్టీలో బలాన్ని పెంచకపోగా.. పునాదులు ఏవనే ప్రశ్నను తెరమీదికి తెస్తున్నాయి. అందుకే ముందుగా సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టాలని.. మేధావులు కోరుతున్నారు.