కుప్పం లాజిక్: భరత్-మంత్రి…బాబు-సీఎం!

ఈ మధ్య ఏపీ సీఎం జగన్ ప్రజల్లోకి వెళ్ళడం మొదలుపెట్టారు. ఇప్పటివరకు ప్రభుత్వాన్ని నడిపిస్తూ…పాలన పరమైన అంశాల్లో బిజీగా ఉన్న జగన్…కొంతకాలం నుంచి ప్రజల్లోకి వెళుతున్నారు. ఇప్పటికే తమ పార్టీ ఎమ్మెల్యేలని ప్రజల్లోనే ఉండాలని ఆదేశించారు. ప్రజల మద్ధతు తెచ్చుకుని, మళ్ళీ అధికారంలోకి రావాలని జగన్ అంటున్నారు. అలాగే తాను కూడా వైసీపీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేయడం స్టార్ట్ చేశారు. 175కి 175 సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో జగన్ ముందుకెళుతున్నారు. ఇదే క్రమంలో చంద్రబాబు కంచుకోట కుప్పంపై జగన్ ఏ స్థాయిలో ఫోకస్ చేశారో అందరికీ తెలిసిందే.

అక్కడ పంచాయితీ, పరిషత్, మున్సిపాలిటీని సైతం గెలుచుకున్నారు…ఇలా అన్నీ ఎన్నికల్లో సత్తా చాటి…ఇక కుప్పం అసెంబ్లీలో కూడా సత్తా చాటాలని ఫిక్స్ అయ్యారు. ఇదే క్రమంలో తాజాగా కుప్పం నియోజకవర్గానికి చెందిన 50 మంది కార్యకర్తలతో జగన్ సమావేశమయ్యారు. ప్రతి నియోజకవర్గానికి చెందిన 50 మంది కార్యకర్తలతో సమావేశమై..ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు, పార్టీ పరిస్తితి గురించి జగన్ తెలుసుకుంటున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే కుప్పం కార్యకర్తలతో సమావేశమై…అక్కడ పార్టీ పరిస్తితులపై ఆరా తీశారు. అలాగే నెక్స్ట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కుప్పంలో గెలవాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అలాగే కుప్పం వైసీపీ శ్రేణులకు బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. కుప్పంలో వైసీపీ తరుపున భరత్ నిలబడతారని, వచ్చే ఎన్నికల్లో ఆయన్ని మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. అలాగే భరత్ ని గెలిపిస్తే…అతనికి మంత్రి పదవి కూడా ఇస్తానని జగన్…కార్యకర్తలతో అన్నారు.

ఇక ఈ ఆఫర్ తో పార్టీ శ్రేణులు ఇంకా దూకుడుగా పనిచేసే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది..పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో గెలిచినంత ఈజీగా కుప్పం అసెంబ్లీలో గెలవడం కష్టం. చంద్రబాబుని ఓడించడం సాధ్యమయ్యే పని కాదు. అలాగే గెలిస్తే భరత్ కు మంత్రి పదవి ఇస్తానని అంటున్నారు…కానీ అక్కడ చంద్రబాబు గెలిస్తే సీఎం..ఈ లాజిక్ అందరికీ తెలుసు. అలాంటప్పుడు ప్రజలు మంత్రి కోసం చూస్తారా..లేక సీఎం కోసం చూస్తారా? అనేది చూడాలి.