అప్పులపై కుప్పిగంతులు.. జనం చెవిలో మోడీ పూలు..! అదేంటో కానీ.. ఈ రెండు కామెంట్లు కూడా సోషల్ మీడియాలోజోరుగా వినిపిస్తున్నాయి. కనిపిస్తున్నాయి. తాజాగా రాష్ట్రాలు భారీగా అప్పులు చేస్తున్నాయని.. రుణ పరిమితులు కూడా దాటిపోయాయని.. ఇక ముందు ముందు.. ఆయా రాష్ట్రాలు ఇదే పద్ధతిలో ముందు కు సాగితే.. ఖచ్చితంగా .. ఆ రాష్ట్రాల పరిస్థితి కూడా మరో శ్రీలంకలా మారుతుందని.. కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించడం.. తీవ్ర సంచలనంగా మారింది.
ఈ ప్రకటన, దీనికి ముందు.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రెజెంటేషన్ వంటివిషయాలను అంత తేలికగా నో.. రాష్ట్రాల అభ్యున్నతిని దృష్టిలోపెట్టుకునో.. దేశం బాగు కోసం చేస్తున్నదనో… చేసిందనో అనుకుం టే.. అంతకన్నా.. తప్పు మరొకటి లేదు. ఎందుకంటే.. వాస్తవానికి రాష్ట్రాలు అప్పులు చేసే పరిస్థితిని కల్పించింది.. కేంద్ర ప్రభుత్వమే. 15 వ ఆర్థిక సంఘం పేరు చెప్పి.. రాష్ట్రాలకు కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంటులను నిలిపివేసింది.. మోడీ సర్కారు.
గతంలో కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ.. రాష్ట్రాలకు గ్రాంటులు వచ్చేవి. ఈ నిధులు తిరిగి ఇవ్వా ల్సిన అవసరం లేని విధంగా రాష్ట్రాలు వినియోగించుకునేవి. కానీ.. ఇప్పుడు కేంద్రం గ్రాంట్లు ఇవ్వడం మానేసింది. వీటి స్థానంలో.. రుణాలు చేసుకునేందుకు వెసులుబాటు ఇచ్చేసింది. రాష్ట్రాల జనాభా ఆధారంగా.. కేంద్రం విధించిన షరతులకు లోబడిన రాష్ట్రాలకు.. కేంద్రం ఆర్బీఐ నుంచి లేదా.. ఇతర సంస్థల నుంచి అప్పులు తీసుకునేందుకు అనుమతి ఇస్తోంది.
ముఖ్యంగా కరోనా సమయంలో కేంద్రం రాష్ట్రాలను ఆదుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ, అలా జరగకపోగా… మరిన్ని అప్పులు చేసుకునేలా ప్రోత్సహించింది కేంద్రం కాదా? వస్తున్న ఇబ్బడి ముబ్బడి పన్ను ఆదాయాన్ని కేంద్రం వెనుకేసుకుని.. కనీసం.. రాష్ట్రాలకు రావాల్సిన వాటా కూడా ఇవ్వకుండా.. ముప్పుతిప్పులు పెడుతున్నది.. కేంద్రం కాదా? ఇవే కదా.. గతంలో తెలంగాణ నుంచి కేరళ వరకు పశ్చిమ బెంగాల్ నుంచి జార్ఖండ్ వరకు.. ముఖ్యమంత్రులు మొత్తుకున్నది. చేతులు కాలే పరిస్థితి కల్పించిందే.. మోడీ సర్కారు.
ప్రజలపై పన్నులు వేసుకుని ఆదాయాన్ని పెంచుకోమని ఉచిత సలహాలు ఇచ్చిన తొలి దశ నుంచి అప్పులు చేసుకోండి.. అనుమతి ఇస్తామని చెప్పిన రెండో దశ పాలన వరకు అప్పుల పాపం.. నిర్వివాదంగా కేంద్ర ప్రభుత్వానిదే. నిజానికి ఇప్పుడు కేంద్రం చెబుతున్నట్టు ఆయా రాష్ట్రాలు నిజంగానే శ్రీలంక వంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉందని అంటే.. ఇది కూడా రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 360 ఏమైనట్టు?
కేంద్రానికి దక్కిన అధికారాలను వినియోగించుకుని ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దాల్సింది పోయి.. ప్రతిపక్ష, ప్రాంతీయ పార్టీలు రాజ్యమేలుతున్న రాష్ట్రాల్లో రాజకీయం చేయడం తప్ప.. ఇప్పుడు మోడీ చేస్తున్న విన్యాసాలు.. వేస్తున్నకుప్పిగంతుల వెనుక మరో పరమార్థం కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు.