పేర్ని నానికి ఈ సారి జ‌గ‌న్ టిక్కెట్ ఇవ్వ‌రా…రీజన్ ఇదేనట ?

కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. గ‌త కొంత కాలంగా బంద‌రు ఎంపీ వల్లభనేని బౌలశౌరిని మాజీ మంత్రి బందరు ఎమ్మల్యే పేర్ని నాని మ‌ధ్య నివురుగ‌ప్పిన నిప్పుల్లా ఉన్న విబేధాలు ఇప్పుడు మ‌రింత తీవ్రం అయ్యాయి. రెండు రోజుల క్రింద‌ట త‌న ఎంపీ ల్యాడ్స్ నిధుల‌తో జ‌రుగుతున్న ప‌నుల‌ను ప‌రిశీలించేందుకు వెళ్లిన ఎంపీ బాల‌శౌరిని ఎమ్మెల్యే వ‌ర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఎంపీ తీవ్ర‌స్థాయిలో రెచ్చిపోవ‌డంతో పాటు పేర్ని నానిని టార్గెట్‌గా చేసుకుని మాట్లాడారు.

వీరిద్ద‌రు కాపు నేత‌లే.. పైగా సీఎం జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితులు. బాలశౌరితో రాజకీయాల్లోకి రాకముందు నుంచే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వ్యాపార సంబంధాలు ఉన్నాయి. పేర్ని నాని పార్టీలో చేరాకే జ‌గ‌న్‌కు బాగా క్లోజ్ అయ్యారు. ఆయ‌న మంత్రిగా ఉన్న‌ప్పుడు పార్టీ త‌ర‌పున ప్ర‌త్య‌ర్థుల‌పై చెణుకులు విసురుతూ జ‌గ‌న్ ద‌గ్గ‌ర కీల‌క నేత‌గా ఎదిగారు. అయితే రెండోసారి విస్త‌ర‌ణ‌లో నానికి ఖ‌చ్చితంగా మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌నుకున్న‌ప్ప‌ట‌కీ ఆయ‌న‌కు ప‌ద‌వి రాలేదు.

దీంతో జ‌గ‌న్ ఆయ‌న్ను కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా నియమించారు. ఇక బాలశౌరి 2004లో తెనాలి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2009లో ఆ నియోజకవర్గం రద్దవడంతో నరసరావుపేట నుంచి ఆయ‌న్ను వైఎస్ ఎంపీగా పోటీ చేయించారు. వైసీపీలోకి వ‌చ్చాక 2014లో గుంటూరు ఎంపీగా జ‌య‌దేవ్‌పై ఓడిపోగా.. గ‌త ఎన్నిక‌ల్లో మాత్రం బంద‌రు నుంచి పోటీ చేసి కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌పై గెలిచారు. ఇలా నాలుగు ఎన్నిక‌ల్లో బాల‌శౌరి నాలుగు సార్లు గెలిచారు.

ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో బాల‌శౌరి బంద‌రు నుంచే అసెంబ్లీకి పోటీ చేస్తాన‌ని చెపుతున్నారు. ఆయ‌న అనుచ‌రులు కూడా ఇప్పుడు ఇదే చెపుతున్నారు. పేర్ని నానిని పెడ‌న పంపేస్తార‌ని కూడా బాల‌శౌరి అనుచ‌రులు చెపుతున్నారు. ప్రస్తుతం పెడన ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేష్ మైల‌వ‌రం నుంచి పోటీ చేస్తార‌ని.. మైల‌వ‌రం ఎమ్మెల్యే కేపీ విజ‌య‌వాడ ఎంపీగా పోటీ చేస్తార‌న్న ప్ర‌చారం అయితే జ‌రుగుతోంది. మ‌రి బాల‌శౌరి, నాని విబేధాలు ఎంత వ‌ర‌కు వెళ‌తాయో ? చూడాలి.