టీడీపీ కీలక నేత, ఆ పార్టీ మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంలో బాధపడుతున్నారు. తాజాగా ఆయన హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తి నియోజకవర్గం నుంచి ఐదసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన చంద్రబాబు కేబినెట్లో అటవీ శాఖా మంత్రిగా కూడా పనిచేశారు. చంద్రబాబుపై అలిపిరి ఘటనలో బాంబు దాడి జరిగినప్పుడు బొజ్జల కూడా గాయపడ్డారు.
కొద్ది రోజుల క్రితం బొజ్జల పుట్టిన రోజు పురస్కరించుకుని ఆయన నివాసంలోనే చంద్రబాబు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరిపించారు. ఇక టీడీపీ పేరుతో ఉన్న కేక్ బాబు స్వయంగా కట్ చేయించి.. బొజ్జలకు తినిపించారు. ఆ తర్వాత కొద్ది సేపు బొజ్జలతో మాట్లాడారు. ఆ తర్వాత ఆయన అనారోగ్యంతో ఉండడంతో అపోలోలో చేర్పించారు. మూడు నెలలు అక్కడే ఉన్న ఆయన ఈ రోజు మృతి చెందారు. ఆయన మృతి పట్ల చంద్రబాబు, టీడీపీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.