ప్రభాస్ తనను చెడగొట్టాడని అంటోన్న బాలీవుడ్ బ్యూటీ

తనను ప్రభాస్ చెడగొడుతున్నాడని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది ఓ స్టార్ బ్యూటీ. దానికి సంబంధించిన సాక్ష్యం కూడా అమ్మడు ఫోటోలు పెట్టింది. ఇంతకీ అసలు మ్యాటర్ ఏమిటని అనుకుంటున్నారా.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆతిథ్యం గురించి అందరికీ తెలిసిందే. ఆయన నటించే సినిమాలోని నటీనటులకు ప్రభాస్ ఇంటి నుండి భోజనం ప్రత్యేకంగా వెళ్తుందని ఇప్పటికే పలుమార్లు రుజువు చేశాడు మన డార్లింగ్. గతంలో దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్‌లకు కూడా ప్రభాస్ ఇంటి భోజనం రుచి చూపించాడు.

తాజాగా ఈ జాబితాలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ దిశా పటానీ కూడా చేరింది. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ K సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా, దిశా పటానీ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అయితే తాజాగా ఈ చిత్ర సెట్స్‌లో జాయిన్ అయిన దిశా పటానీకి ప్రభాస్ ఇంటి నుండి భోజనం పంపించాడు.

ఎప్పుడూ డైట్ అంటూ తిరిగే తమను ఇలా ఇంటి భోజనం పెట్టి ప్రభాస్ చెడగొడుతున్నాడని దిశా చెప్పుకొచ్చింది. ఇలాంటి కమ్మటి భోజనం పెట్టినందుకు ప్రభాస్‌కు థ్యాంక్స్ తెలిపింది ఈ చిన్నది. ఇక ప్రభాస్ ఈ విధంగా అందరూ హీరోయిన్లకు తన ఇంటి నుండి భోజనం తీసుకెళ్లడంతో వారు ఆయనకు పెద్ద ఫ్యాన్ అవుతున్నారు. మరి ప్రభాస్ కారణంగా ఇంకా ఎంత మంది హీరోయిన్లు చెడిపోతారో చూడాలి.