ఎన్టీఆర్ వల్లే ఇలా ఉన్నా.. అసలు విషయం చెప్పేసిన కేజీయఫ్ డైరెక్టర్!

కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ కేజీయఫ్ చాప్టర్ 2 ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్‌ను ఏ రేంజ్‌లో షేక్ చేస్తుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన విధానం.. హీరో ఎలివేషన్స్‌కు అతడు చూపించిన ప్రాధాన్యం ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించి టాలీవుడ్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేశాడు.

ప్రస్తుతం కేజీయఫ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తు్న్న ప్రశఆంత్ నీల్, తన నెక్ట్స్ చిత్రాలన్నీ కూడా తెలుగు హీరోలతోనే ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే ప్రభాస్‌తో సలార్ చిత్ర షూటింగ్ జరుపుకుంటున్న ఈ డైరెక్టర్, ఆ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయనున్నాడు. ఇక తారక్ కోసం ప్రశాంత్ నీల్ ఓ ఆటం బాంబ్ కంటే ఎక్కువ విస్ఫోటం ఉండే కథను రెడీ చేసినట్లు గతంలోనే అన్నాడు.

అయితే తాను కన్నడలో కాకుండా ఇలా తెలుగులో సినిమాలు చేయడానికి ముఖ్య కారణం ఎన్టీఆరే అని చెబుతున్నాడు ఈ డైరెక్టర్. తాను కేజీయఫ్-1 సినిమా తీసినప్పుడు అందరికంటే ముందుగా తనను అభినందించింది తారక్ మాత్రమే అని చెప్పుకొచ్చాడు. అదిరిపోయే సినిమా తీశావంటూ తారక్ తనను పొగిడాడని.. ఆయన తనపట్ల చూపించిన ప్రేమను తాను ఎప్పటికీ మరిచిపోలేనని ప్రశాంత్ నీల్ అంటున్నాడు. ఇక ఆ తరువాత మహేష్ బాబు కూడా తనను మెచ్చుకున్నాడని.. అందుకే టాలీవుడ్ హీరోలంటే తనకు చాలా గౌరవం పెరిగిందని ప్రశాంత్ నీల్ కామెంట్ చేశాడు. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.