రాష్ట్రంలో గత రెండు రోజులుగా జరిగిన రాజకీయాలను గమనిస్తే.. అందరి దృష్టీ.. నెల్లూరు పైనే ఉంది. అన్ని మీడియా ఛానెళ్లు కూడా నెల్లూరు బాటనే పట్టాయి. ఎవరు మాట్లాడుకున్నా.. నెల్లూరులో ఏం జరిగింది? ఏం జరుగుతుంది? అనే చర్చే సాగింది. ఆ విధంగా ఒక్కసారిగా తారస్థాయికి నెల్లూరు రాజకీయాలు చేరిపోయాయి. ఈ క్రమంలో వైసీపీ సాధించింది ఏమైనా ఉందా? అనేది ఆసక్తిగా మారింది. నెల్లూరులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. వర్సెస్ ప్రస్తుతం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కాకాని గోవర్ధన్రెడ్డి మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం జరుగుతుందని అందరూ అనుకున్నారు.
ఎందుకంటే.. అనిల్ ఆవిధంగా రెచ్చిపోయారు. ఫ్లెక్సీలు చించేయడం.. మంత్రిని టార్గెట్ చేస్తూ. వ్యంగ్యాస్త్రాలు సంధించడం.. వంటివి అనిల్ దూకుడుకు పరాకాష్టగా మారాయి. దీనికితోడు.. మంత్రి కాకాని వస్తున్న సమయంలోనే తాను పోటీగా సభ పెట్టారు అనిల్. ఇక, మంత్రి కూడా తనకు ఆత్మీయ సత్కారం ఉందని పేర్కొంటూ.. ఆయన కూడా సభ పెట్టారు. దీంతో ఇరు పక్షాల మధ్య తాడేపేడో తేలుతుందని.. రాజకీయ వర్గాలు కూడా ఎదురు చూశాయి. అయితే.. ఏదో అవుతుందని.. అందరూ అనుకున్నా.. ఏమీ కాకుండానే పరిస్థితి సద్దు మణిగింది. కానీ, ఈ మొత్తం ఎపిసోడ్లో ఎవరు బద్నాం అయ్యారు? అనేది కీలకంగా మారింది.
ఎలా అంటే.. పార్టీ ఇద్దరికీ పదవులు ఇచ్చింది. ఒకరిని తప్పించింది. పార్టీ విషయం పరంగా చూసుకుంటే.. ఇద్దరినీ సమానంగా నే చూసింది.క కానీ.. పార్టీకి అనిల్ ఏం చేశారు. తన దూకుడు ద్వారా.. మీడియాలో హైలెట్ అయ్యారే తప్ప.. పార్టీకి ప్లస్ అయ్యేలా ఆయన వ్యవహరించలేక పోయారనే వాదన వచ్చింది. ఆయన చేసిన వ్యాఖ్యలు.. దూకుడు.. వంటివి విమర్శల పాలయ్యాయి. అదేసమయంలో కాకాని వ్యవహరించిన తీరు.. ప్లస్ అయింది. అందరూ సమానమే.. అనిల్ అలా అని ఉండకపోవచ్చు.. అన్నా తప్పులేదు.. అని కాకాని చేసిన వ్యాఖ్యలు ఆయన పరిణితికి అద్దం పట్టాయి.
దీంతో అనిల్ మైనస్ అవ్వగా.. కాకాని.. ప్లస్ అయ్యారు. ఈ పరిణామాలతో వైసీపీ కూడా బద్నాం అయింది. చివరి నిముషంలో అనిల్ను అదుపు చేసి ఉండకపోతే.. పార్టీపూర్తిగా మైనస్లోకి వెళ్లిపోయేదనే విశ్లేషణలు వస్తుండడం గమనార్హం. మరి ఇప్పటికైనా.. నాయకులు తమ తమ స్థాయిలు తెలుసుకుని వ్యవహరిస్తే.. మంచిదని అంటున్నారు పరిశీలకులు.