రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్ కోసం ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో కోట్లాది ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న సంగతి తెలిసిందే. మూడేళ్లుగా రు. 450 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కోసం యేడాదికి పైగా వెయిటింగ్లో ఉంది. ఒమిక్రాన్ లేకుండా ఉండి ఉంటే జనవరి 7నే త్రిబుల్ ఆర్ రిలీజ్ కావాల్సి ఉంది. ఈ పాటికే ఈ సినిమా రిజల్ట్ ఏంటి ? రికార్డులు ఏంటి ? వసూళ్లు ఏంటో తేలిపోయి ఉండేవి.
మరోసారి వాయిదా పడినా కూడా త్రిబుల్ ఆర్పై ఉన్న అంచనాలు అయితే అలాగే ఉన్నాయి. అయితే పదే పదే వాయిదా పడుతూ వస్తుండడంతో ప్రేక్షకుల్లో అసహనం కూడా పెరుగుతోంది. రాజమౌళిని టార్గెట్ చేస్తూ ట్రోల్స్, మీమ్స్ కూడా తెగ పేలుతున్నాయి. ఇక డిసెంబర్లో ముంబై వేదికగా త్రిబుల్ ఆర్ ప్రమోషన్ భారీ ఎత్తున జరిగింది. ఈ ప్రమోషనల్ ఈవెంట్ వీడియో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది.
ఇందులో రాజమౌళి మాట్లాడుతూ సినిమాలో ఓ సీన్ గురించి భయంకరంగా చెప్పాడు. ఇప్పటి వరకు ఏ ప్రోమోలో కూడా ఆ సీన్ గురించి చిన్న హింట్ కూడా ఇవ్వలేదని.. అసలు దాని గురించి కూడా ఎవ్వరికి ఐడియా లేదని.. రేపు సినిమా రిలీజ్ అయ్యాక థియేటర్లలో ఆ సీన్ చూసినప్పుడు ప్రేక్షకుల్లో మామూలు ఎగ్జైట్మెంట్ ఉండదని చెప్పాడు.
ఈ సీన్ సెకండాఫ్లో వస్తుందని.. ఈ సీన్ చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి కండరాలు బిగుసుకోవడంతో పాటు ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయి మరీ సినిమాలో లీనమైపోతారని.. అదే టైంలో గుండె కూడా చాలా వేగంగా కొట్టుకుంటుందని చెప్పాడు. ఈ ఒక్క సీన్లో తారక్ – చెర్రీ నటన పీక్ స్టేజ్లో ఉంటుందని చెప్పాడు. ఏదేమైనా ఈ ఒక్క సీన్ గురించి రిలీజ్కు ముందే రాజమౌళి ఈ రేంజ్లో ఎలివేషన్ ఇచ్చాడంటే రేపటి రోజు థియేటర్లలో ఆ సీన్ ఎంతలా ఉంటుందో ? చూడాలి.