విడాకుల తర్వాత క్రేజీ డైరెక్టర్స్ ని లైన్ లో పెట్టిన నాగ చైతన్య

విడాకుల తర్వాత అక్కినేని నాగార్జున వారసుడు నాగ చైతన్య మరింత దూకుడు పెంచాడు. వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు. క్రేజీ డైరెక్టర్స్ తో కలిసి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. తండ్రి నాగార్జునతో కలిసి నటించిన తాజా సినిమా బంగార్రాజు. కల్యాణ్ క్రిష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనాల ముందుకు రాబోతుంది. జనవరి 14న తెలుగు రాష్ట్రాలతో పాటు అబ్రాడ్ లోనూ గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్ ప్రయత్నాలు చేస్తుంది. ఈ సందర్భంగా మాట్లాడిన అక్కినేని నాగ చైతన్య తన తదుపరి ప్రాజెక్టుల గురించి చెప్పాడు.

ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ మూవీ చేస్తున్నట్లు వెల్లడించాడు నాగ చైతన్య. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు చెప్పాడు. వీలైనం త్వరలో తర్వాత షెడ్యూల్ మొదలు కానున్నట్లు వెల్లడించాడు. అటు విక్రమ్ కుమార్ డైరెక్షన్ లోనూ ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాడట. ఇప్పటికే దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా మొదలైనట్లు వెల్లడించాడు. ఇప్పటి వరకు తనకు హార్రర్ మూవీస్ అంటే భయం అని చెప్పాడు. అయితే ప్రస్తుతం తాను హార్రర్ వెబ్ సిరీస్ లో నటించడం విశేషం అన్నాడు. అయితే ఈ వెబ్ సిరీస్ రెడీ అయ్యాక.. ఆడియో లేకుండా మ్యూట్ లో పెట్టి చూస్తానని సరదాగా కామెంట్ చేశాడు చైతు.

వీటి తర్వాత మరో ప్రాజెక్టు చేస్తున్నట్లు వెల్లడించాడు. మహేష్ బాబుతో కలిసి సర్కారు వారి పాట సినిమా చేస్తున్న దర్శకుడు పరుశురామ్ తో కలిసి ఓ సినిమా చేయనున్నట్లు చెప్పాడు. అటు నాంది దర్శకుడు విజయ్ కనకమేడలతో కలిసి మరో మూవీకి ప్లాన్ చేస్తున్నట్లు చెప్పాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి స్టోరీ ఫైనల్ కాలేదని వెల్లడించాడు. త్వరలోనే ఫైనల్ స్టోరీ రెడీ అవుతుందన్నాడు. ఈ ప్రాజెక్టులతో పాటు మరికొన్ని స్టోరీలు చర్చిస్తున్నట్లు చెప్పాడు. త్వరలోనే మరికొన్నింటికి ఓకే చెప్పబోతున్నట్లు వెల్లడించాడు.