ఢిల్లీకి వచ్చి సమాధానం చెప్పండి..

హుజూరాబాద్ ఉప ఎన్నికలు జరిగాయి.. బీజేపీ గెలిచింది.. టీఆర్ఎస్ ఓడింది.. కాంగ్రెస్ పార్టీ కూడా ఓడిపోయిది. ఇది అందరి తెలిసిన విషయమే. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం ఈ ఫలితాలను సీరియస్ గా తీసుకొంది. టీ.కాంగ్రెస్ నాయకులపై ఫైరవుతోంది. ఎన్నికల్లో ఓడిపోవడం గురించి కాదు ఈ బాధ.. పార్టీకి వచ్చిన ఓట్ల గురించే అధిష్టానం తట్టుకోలేకపోతోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెబుతున్న నాయకులను ఉప ఎన్నికల్లో ఇంత దారుణంగా ఎలా ఓడిపోయామని అధిష్టానం అడుగుతున్న ప్రశ్నలకు మౌనమే సమాధానమైంది. గత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 34 శాతం ఓట్లు వస్తే.. ఈ సారి మాత్రం 1.50 శాతమే వచ్చాయి. దీంతో ఎక్కడో.. ఏదో కావాలనే చేశారనే అనుమానం అధిష్టానంలో మొదలైంది. అందుకే ఈనెల 13న ఢిల్లీకి వచ్చి అధిష్టానంతో మాట్లాడాలని టీ.కాంగ్రెస్ నాయకులను ఆదేశించింది.

దీంతో ఢిల్లీకి వెళ్లి ఏం చెప్పాలో.. ఎలా చెప్పాలో అని నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. హుజూరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక విషయంలో ఆలస్యం చేసిందని..అందుకే ఇలా జరిగిందని కొందరు ఇప్పటికే లేఖలు కూడా రాశారు. ఇదిలా ఉండగా మూడు రోజుల క్రితం కర్ణాటకకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేను పిలిచి హుజూరాబాద్లో పార్టీ పరాజయానికి గల కారణాలేంటని నివేదిక తయారు చేయాలని కోరింది. ఏది ఏమైనా హుజూరాబాద్ లో ఘోర పరాజయంతో ఇక్కడి నేతలకేమో గానీ.. డిల్లీ పెద్దలకు మాత్రం నిద్రపట్టడం లేదు. మరి రేవంత్ అండ్ టీమ్ హస్తినకు వెళ్లి ఏం సమాధానం చెప్పి వస్తారో వేచి చూడాలి.