ఆదిపురుష్‌కు అంతం పలికిన ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే, ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి లైన్‌లో పెడుతూ వస్తున్నాడు. ఇప్పటికే సలార్, ప్రాజెక్ట్ K, ఆదిపురుష్, స్పిరిట్ వంటి చిత్రాలను లైన్‌లో పెట్టిన ప్రభాస్, ఈ సినిమాలన్నింటినీ ఎప్పుడు ఫినిష్ చేస్తాడా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు. కాగా బాలీవుడ్‌లో స్ట్రెయిట్‌గా ప్రభాస్ నటిస్తున్న చిత్రంగా ‘ఆదిపురుష్’ నిలుస్తుంది.

ఈ సినిమాను దర్శకుడు ఓం రావుత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడంతో పాటు ఈ సినిమాను మైథలాజికల్ మూవీగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో మనల్ని అలరించేందుకు రెడీ అవుతున్నాడు. త్రీడీ మూవీగా రానున్న ఈ సినిమాకు సంబంధించిన తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేశాడు ప్రభాస్. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రభాస్‌కు ఘనంగా వీడ్కోలు పలికింది. అంతేగాక ఆదిపురుష్ షూటింగ్ మొదలై 100 రోజులు పూర్తి కావడంతో కేక్ కటింగ్ కూడా చేశారు.

ఏదేమైనా అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా వస్తున్న ఈ సినిమా షూటింగ్‌ను ప్రభాస్ ఎప్పుడు పూర్తి చేస్తాడా అని చూసిన ఫ్యాన్స్‌కు ప్రభాస్ సడెన్ షాక్ ఇచ్చాడని చెప్పాలి. ఇంతటి ప్రతిష్టాత్మకమైన చిత్రంలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను ముగించుకుని, తన మిగతా చిత్రాలను పూర్తి చేసే పనిలో ప్రభాస్ పడ్డాడు. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ చిత్రాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు. కాగా ఆదిపురుష్ చిత్రాన్ని 11 ఆగష్టు, 2022లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.