అబ్బాయితో కాగానే బాబాయితో.. ఆచార్య ప్లాన్ మామూలుగా లేదుగా!

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఏ హీరో ఫుల్ స్పీడులో ఉన్నాడంటే ఖచ్చితంగా నందమూరి బాలకృష్ణ పేరే చెప్పాలి. ఇప్పటికే అఖండ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేసిన బాలయ్య, తన నెక్ట్స్ సినిమాను తాజాగా లాంఛ్ చేశారు. ఇక అటు ‘ఆహా’ ప్లాట్‌ఫాం కోసం ఓ టాక్‌షో కూడా నిర్వహిస్తున్న బాలయ్య యమస్పీడులో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో బాలయ్య కోసం ఇప్పుడు మరో స్టార్ డైరెక్టర్ అదిరిపోయే కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ బాలయ్య కోసం కథను రెడీ చేసిన ఆ స్టార్ డైరెక్టర్ ఎవరా అని అనుకుంటున్నారా?

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ వంటి క్రేజీ చిత్రాన్ని తెరకెక్కించిన స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమా రిలీజ్‌కు రెడీ చేశాడు. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ మూవీని యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి చేసేందుకు రెడీ అయ్యాడు కొరటాల. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ కాంబో సెట్ కావడంతో వీరిద్దరి కాంబినేషన్‌లో ఎలాంటి సినిమా వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారట. అంతేగాక ఈ డైరెక్టర్ బాలయ్యను దృష్టిలో పెట్టుకుని ఓ పవర్‌ఫుల్ కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది.

ఈ కథను ఒక ప్రముఖ నిర్మాతకు వినిపించడం కూడా జరిగిందట. అయితే త్వరలోనే ఈ కథను బాలయ్యకు వినిపించి ఓకే చేయించుకునేందుకు కొరటాల రెడీ అవుతున్నాడట. అయితే ఈ సినిమా మాత్రం పట్టాలెక్కేందుకు చాలా సమయమే పడుతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. తమ నెక్ట్స్ చిత్రాలు పూర్తయితే గాని బాలయ్య-కొరటాల కాంబో పట్టాలెక్కదు. మరి ఈ కాంబో నిజంగానే సెట్ అయితే, ఆ సినిమా ఎలా ఉండబోతుందా అని నందమూరి అభిమానులు అప్పుడే ఆసక్తిగా చూస్తున్నారు.