నటసింహం నందమూరి బాలకృష్ణ త్వరలోనే భక్తి ఛానల్ను ప్రారంభించబోతున్నారు. ఈ విషయాన్ని ఎవరో కాదు.. ఆయనే స్వయంగా తెలియజేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్గా కనిపించబోతున్న ఈ చిత్రం డిసెంబర్ 2న గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ షురూ చేసిన చిత్ర యూనిట్.. నిన్న హైద్రాబాద్లో ని శిల్పా కళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ వేడుకకు దిగ్గజ దర్శకుడు రాజమౌళి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
అయితే ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. `కార్తీకమాసం కాబట్టి అందరికీ ఆ శివపార్వతుల ఆశీస్సులు ఉండాలి. మన ప్రతి మాట వెనుక ఒక పవర్ ఉంటుంది. నవరసల్లాగే మన పూజా విధానాలు కూడా తొమ్మిది రకాలని చెబుతూ ఉంటారు మన భక్తి టీవీల్లో. ఇక ఆహా లాగే నేను కూడా త్వరలోనే ఓ భక్తి టీవీ ఛానల్ను స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను` అని బాలయ్య ప్రకటించారు.
కాగా, బాలయ్యకు భక్తి శ్రద్ధలు ఎక్కువన్న సంగతి తెలిసిందే. ఆయన్ని ఎప్పుడు కదిలించినా.. పురాణాల గురించో, పద్యాల గురించో, శాస్త్రాల గురించో వర్ణిస్తుంటారు. ఇప్పుడు ఆ ఆసక్తితోనే బాలయ్య భక్తి ఛానల్ ప్రారంభిస్తున్నారని.. త్వరలోనే ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు బయటకు రానున్నాయని సమాచారం.