మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు నేటి ఉదయం జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఓటింగ్ ప్రక్రియ జోరుగా జరుగుతున్న తరుణంలో.. పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది.
ఎన్నికల కేంద్రం లోపల ప్రచారం చేస్తున్నారంటూ రెండు ప్యానెళ్ల మధ్య వివాదం నెలకొంది. దాంతో ఇరు వర్గాలను దూరంగా పంపారు పోలీసులు. అయితే ఇంతలోనే మళ్లీ వివాదం చెలరేగింది. రిగ్గింగ్ జరుగుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
పోలింగ్ కేంద్రంలో లేని నటీనటుల పేర్లతో ఓట్లు వేస్తున్నారని మంచు విష్ణు ప్యానెల్ ఆరోపణలు చేస్తోంది. దీంతో ఈ ఫిర్యాదును స్వీకరించిన ఎన్నికల అధికారి పోలింగ్ను ఆపేసి.. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. రిగ్గింగ్ జరిగిందని తేలితే తదుపరి చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారి అంటున్నారు.