ఇక సెలవు.. ముగిసిన పునీత్ అంత్యక్రియలు..!

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ఇవాళ ఉదయం పూర్తయ్యాయి. శుక్రవారం ఉదయం జిమ్ చేస్తుండగా పునీత్ గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. పునీత్ ను వెంటనే ఆసుపత్రికి తీసుకు పోయినప్పటికీ డాక్టర్లు ఆయనను బతికించలేక లేకపోయారు. ఆయన భౌతికకాయాన్ని బెంగళూరు లోని కంఠీరవ స్టేడియంలో ఉంచిన సంగతి తెలిసిందే.

నిన్న సాయంత్రం పునీత్ రాజ్ కుమార్ అంతక్రియలు జరగాల్సి ఉండగా.. ఆయన కుమార్తె దృతి అమెరికా నుంచి రావడం ఆలస్యం కావడం, పునీత్ కడచూపు కోసం రాష్ట్రం నలుమూలల నుంచి అభిమానులు తరలి వస్తుండడంతో అంత్యక్రియలను ఇవాల్టికి వాయిదా వేస్తున్నట్టు కర్నాటక ముఖ్యమంత్రి ప్రకటించారు. నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో పునీత్ కుమార్ అమెరికా నుంచి చేరుకుంది.

దీంతో ఇవాళ ఉదయమే పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు పూర్తి చేశారు. కంఠీరవ స్టేడియంలో పునీత్ తండ్రి రాజ్ కుమార్ కు సమాధి నిర్మించిన చోటే పునీత్ ని కూడా పూడ్చి పెట్టారు. అశేష జనవాహిని మధ్య ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. పునీత్ కు మగపిల్లలు లేకపోవడంతో ఆయన సోదరుడు రాఘవేంద్ర కుమారుడు వినయ్ అంత్యక్రియలు జరిపించారు. కన్నడ, తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీనటులు, రాజకీయ నాయకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పునీత్ రాజ్ కుమార్ కు నివాళులు అర్పించి తుది వీడ్కోలు పలికారు.