టెలికాం దిగ్గజం సంస్థలలో ఒకటైన రిలయన్స్ జియో ఈరోజు కొంత సమయం భారతదేశంలో జియో నెట్వర్క్ ఉపయోగిస్తున్న వారి మొబైల్స్ లో అంతరాయం కలిగింది. తాజాగా ఈ విషయాన్ని ‘డౌన్డిటెక్టర్’ వెల్లడించింది. నెట్వర్క్ సమస్య గురించి వినియోగదారుల నుంచి ఫిర్యాదులు పెరిగినట్లు తెలిపింది. అయితే దీని ప్రభావం ఏ మేరకు ఉందనేది తెలియాల్సి ఉందని పేర్కొంది. అంతేకాదు ఈ మధ్య కాలంలో ఎయిర్టెల్ తో పోల్చుకుంటే జియో నెట్వర్క్ చాలా స్లో అవుతోంది అంటూ కూడా కస్టమర్లు గగ్గోలు పెడుతున్నారు.
ముఖ్యంగా జియో నెట్వర్క్లో అంతరాయంపై వినియోగదారులు ట్విటర్ వేదికగా ఫిర్యాదు చేస్తున్నారు. భారత్లో ట్విట్టర్ లో జియో వినియోగదారులు జియోడౌన్ అనే హ్యాష్ట్యాగ్ తో ట్రెండ్ చేస్తున్నట్లు డౌన్ డిటెక్టర్ తెలిపింది. కేవలం ఈ ఒక్క రోజులో ఇప్పటి వరకు దాదాపు 4 వేల మంది వినియోగదారులు ఈ నెట్వర్క్ సమస్యను నివేదించారు. ట్విటర్ పోస్టులను బట్టి చూస్తే.. ఈ రోజు ఉదయం నుంచి కనెక్టివిటీ సమస్యలు ఎదురైనట్లు తెలుస్తోంది. దాంతో రిలయన్స్ జియో కస్టమర్ కేర్కు ఫిర్యాదుల తాకిడి పెరిగినట్లు తెలిపింది.
ఈ విషయంపై స్పందించిన జియో అధికారులు తమ బృందం కనెక్టివిటీని చెక్ చేస్తోంది అంటూ వివరణ ఇచ్చారు.