నేను గెలవడం పక్కా.. నా వెనుక ఎవరున్నారో మీకు తెలీదు.. బండ్లన్న షాకింగ్ కామెంట్స్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అపార భక్తుడైన బండ్ల గణేష్.. ఏం చేసినా సంచలనంగానే ఉంటుంది. ఆయన ఎక్కడ ఉన్నా మీడియా అక్కడ వాలి పోతూ ఉంటుంది. మా ఎన్నికల్లో ముందు నుంచి ప్రకాష్ రాజ్ ప్యానెల్లో క్రియాశీలకంగా ఉంటూ వచ్చిన బండ్ల గణేష్ ఆశ్చర్యంగా ఆ ప్యానెల్ నుంచి బయటకు వచ్చాడు. సొంతంగా జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించాడు. ఇవాళ నామినేషన్ కూడా దాఖలు చేశాడు.

ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ.. మా ఎన్నికల్లో జనరల్ సెక్రటరీగా తన గెలుపు ఖాయమని.. తనకు ఎవరెవరు మద్దతు ఇస్తున్నారో..ఎవరికీ తెలియదని కామెంట్స్ చేశాడు.మా ఎన్నికల్లో తాను ఒక రాకెట్ లా దూసుకెళ్తున్నానని తన విజయాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. తాను విజయం సాధిస్తే 100 మంది పేద కళాకారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందేలా కృషి చేస్తానని చెప్పారు.మన తెలుగు హీరోలు బంగారు గనులు, కోహినూరు వజ్రాలని, ఆ వజ్రాలు ప్రకాశిస్తే ఎన్నో భవనాలు కట్టి ఇవ్వొచ్చన్నారు.

అక్టోబర్ 10వ తేదీన మా ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకే ఏపీ రాజకీయాల గురించి మాట్లాడటం లేదన్నారు. ఎన్నికలు ముగియగానే 11వ తేదీ ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడతానని, ఈలోగా కొంపలు మునిగిపోయేదేమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. గత మా ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు.. సినీ ఇండస్ట్రీకి ఏం చేశారని బండ్లన్న ప్రశ్నించారు. దీని గురించి అడిగితే కరోనా పేరు చెబుతున్నారు. కరోనా రాకపోయి ఉంటే వీళ్ళేదో మొత్తం దున్నేసినట్లు చెబుతున్నారని వ్యాఖ్యానించారు.