మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు తెలుగు సినీ ఇండస్ట్రీలో వేడి పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. అధ్యక్ష పదివిని దక్కించుకునేందుకు సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటీ, సీవీఎల్ నర్సింహరావు పోటీ పడుతున్నారు. అయితే వీరిలో ప్రధాన పోటీ మాత్రం ప్రకాష్ రాజ్, విష్ణు ప్యానల్స్ మధ్యే నెలకొంది. ఇక ఎన్నికలు కూడా దగ్గర పడుతుండడంతో రెండు ప్యానల్ సభ్యులు ప్రచారంలో బిజీ బిజీ అయిపోయారు.
అయితే కొద్ది రోజుల క్రితం ప్రకాష్ రాజ్ గెలుస్తారనే టాక్ ఉండేది. కానీ, ఇప్పుడు ఖచ్చితంగా విషయం మంచు విష్ణుదే అని ప్రచారం ఊపందుకుంది. ఇందుకు కారణం `రిపబ్లిక్` ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ స్పీచే. టికెట్ల రేట్లు, ఆన్లైన్ అమ్మకాలు తదితర విషయాల్లో పవన్ జగన్ ప్రభుత్వాన్ని ఏకేశారు. దాంతో తీవ్ర దూమారం చెలరేగింది. పవన్ వ్యాఖ్యలు సినీ పెద్దలను సైతం కలవరపాటుకు గురి చేస్తాయి.
అయితే ఇప్పుడు పవన్ స్పీచే విష్ణుకి కలిసొచ్చిందని టాక్ నడుస్తోంది. అదెలా అంటే.. వైసీపీ ప్రభుత్వానికి మోహన్బాబు సానుభూతి పరులుగా ఉన్నారు. పైగా వైఎస్ జగన్కి బంధువులు కూడా. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికల్లో విష్ణుని గెలిపిస్తే ఏపీలో చిత్ర పరిశ్రమకి సంబంధించిన సమస్యలను, థియేటర్ల ఓపెన్కి సంబంధించిన ఇష్యూని, అలాగే టికెట్ రేట్ల విషయాన్ని తాను సీఎం జగన్తో మాట్లాడి పరిష్కరిస్తానని మోహన్బాబు సినీ పెద్దలకు హామీ ఇచ్చారట. దాంతో ఇప్పుడు సినీ పెద్దలందరూ విష్ణునే గెలిపించాలని నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.