ఏపీలో స్వ‌ల్పంగా పెరిగిన క‌రోనా కేసులు..11 మంది మృతి!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా కంట్రోల్ అయింది.

గ‌త కొద్ది రోజులుగా రెండు వేల‌కు లోపుగా రోజూవారీ కేసులు న‌మోదు అవుతున్నాయి. అయితే మొన్న‌టితో పోలిస్తే నిన్న మాత్రం పాజిటివ్ కేసులు స్వ‌ల్పంగా పెరిగాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,145 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో అత్య‌ధికంగా తూర్పు గోదావ‌రి జిల్లాలో 274 కేసులు న‌మోదు కాగా.. అతి స్వ‌ల్పంగా కర్నూలు జిల్లాలో 11 కేసులు న‌మోదు అయ్యాయి.

దీంతో రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు 20,33,419 కి చేరింది. అలాగే గత 24 గంటల్లో 11 మంది మృత్యువాత ప‌డ్డారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో మృతుల సంఖ్య 14,030 ద‌గ్గ‌ర నిలిచింది. అలాగే నిన్నొక్క రోజే 1,243 మంది క‌రోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 20,04,786 కి చేరుకుంది. ప్ర‌స్తుతం ఏపీలో 14,603 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, నిన్న‌ రాష్ట్ర‌వ్యాప్తంగా 62,252 క‌రోనా టెస్ట్‌లు నిర్వ‌హించారు.