శభాష్..RRR(సొంత పార్టీ వాళ్లతో కాదులెండి)

వైసీపీ ఎంపీ రఘురామక్రిష్ణం రాజు అందరిచేతా శభాష్ అనిపించుకుంటున్నారు. సొంత పార్టీ వాళ్లతో కాదులెండి.. పార్లమెంటు సభ్యులతో.. ఎందుకంటే ఈయనే పార్లమెంటు సమావేశాలకు గైర్హాజరు కాకుండా సమావేశాల్లో పాల్గొంటున్నారు. సమావేశాల్లో ఈయన హాజరు 96 శాతం ఉంది. హాజరు కావడం మాత్రమే కాదు.. ప్రశ్నలు అడగడంలోనూ.. చర్చల్లో పాల్గొనడంలోనూ ఈయనే ముందున్నారు. ప్రజాప్రయోజనం కింద జరిగిన 50 చర్చల్లో పాల్గొనడంతోపాటు 145 ప్రశ్నలు వేసి సమాధానం రాబట్టారు. RRR తరువాత తెలుగుదేశం పార్టీ ముగ్గరు ఎంపీలు యాక్టివ్ గా ఉంటున్నారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ 89 శాతం అటెండెన్స్ (54 చర్చలు, 154 ప్రశ్నలు), విజయవాడ ఎంపీ కేసినేని నాని 89 శాతంతో తరువాతి స్థానాల్లో ఉన్నారు. ఇక ఏపీలోని అధికార పార్టీ సభ్యుల్లో వైఎస్ అవినాష్ రెడ్డి అటెండెన్స్ లో పూర్ అని చెప్పవచ్చు. అతని ప్రెజెంట్ కేవలం 32 శాతం మాత్రమే. గత రెండేళ్లలో ఆయన కేవలం ఒకే ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు.

బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కూడా 45 శాతం అటెండెన్స్ మెయింటెన్ చేస్తున్నారు. ఈ ఎంపీ ఒక్క చర్చలో పాల్గొన్నారు కానీ.. కనీసం ఒక్క ప్రశ్న కూడా అడగలేకపోయారు. వైసీపీ కాకినాడ ఎంపీ వంగా గీత మాత్రం చెప్పుకోదగ్గ ప్రశ్నలు సంధించారు. 37 చర్చా కార్యక్రమాల్లో పాల్గొని 173 ప్రశ్నలతో దూసుకుపోతున్నారు. ఈ అటెండెన్స్ గమనిస్తే మన ఎంపీలకు అసలు ప్రజా సమస్యలంటే తెలుసా.. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థమవుతోందా? అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కోట్ల రూపాయలు వారి మీద ప్రభుత్వాలు వెచ్చిస్తుంటే.. వారి వ్యాపారాలు, పదవుల కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు కానీ జనం గురించి ఆలోచిస్తున్నారా అని అనిపిస్తుంది. ఢిల్లీలో సొంత పనులు చూసుకునేందుకు జనం డబ్బుతో తిరగడానికి ఎన్నికల్లో గెలిచినట్లుంది వీరి వ్యవహారం.