కాంస్యం సాధించి చ‌రిత్ర సృష్టించిన సింధు..!!

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ లో అద‌ర‌గొట్టి.. మన దేశానికి మరో మెడల్ సాధించిపెట్టింది. సెమీఫైనల్స్‌లో ఓడిన ఇద్దరు ప్లేయర్స్‌ మధ్య కాంస్యం కోసం జరిగిన మ్యాచ్‌లో సింధు ఘనవిజయం సాధించి శ‌భాష్ అనిపించుకుంది. సింధు 21-13, 21-15 తేడాతో చైనా క్రీడాకారిణి బింగ్‌ జియావోపై గెలుపొందింది.

సెమీస్‌లో ఓడినందుకు ఒత్తిడికి గురైనా.. ఎక్క‌డా త‌డ‌బాటు లేకుండా ప్రత్యర్థిపై పైచేయి సాధిస్తూ గేమ్‌ను అద్భుతంగా ఫినిష్ చేసింది. ఇక ఈ విజ‌యంతో సిందూ ఓ అరుదైన ఘ‌నతను సొంతం చేసుకుంది. ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు పుటల్లోకెక్కింది. ఈ నేప‌థ్యంలోనే ఆమెకు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తున్నాయి.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి కిరణ్ రిజిజు, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తదితరులు సింధును మనస్ఫూర్తిగా అభినందించారు. కాగా, 2016లో బ్రెజిల్ రాజధాని రియో డీ జనేరియోలో జరిగిన ఒలింపిక్స్‌లో సింధు రజతాన్ని గెలచుకుంది. ఇక ఇప్పుడు కాంస్యం ద‌క్కించుకుని చ‌రిత్ర‌ సృష్టించింది.