టాలీవుడ్ యంగ్ & టాలెంటెడ్ హీరో అడవి శేష్ నిన్న రక్షాబంధన్ సందర్భంగా మహిళలందరికీ ఓ పిలుపునిచ్చాడు. ఇంతకీ ఏంటా పిలుపు..? అసలు మ్యాటరేంటో..? తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. మహిళల రక్షణ కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం `దిశ` యాప్ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
ఈ మొబైల్ యాప్ను విద్యార్థినులు, యువతులు, మహిళలు డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా సీఎం జగన్ తెలిపారు. ప్రస్తుతం దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం, ఆపద సమయంలో ఉపయోగించడం ఎలా అనే విషయాలపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్విస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖలో దిశ యాప్ పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో హీరో అడవి శేషు పాల్గొన్నారు.
బీచ్ రోడ్లో పోలీసులతో కలిసి అవగాహన కల్పించారు. మహిళల రక్షణకు దిశ యాప్ ఎంతో ఉపయోగపడుతుందని శేష్ తెలిపాడు. రాఖీ పండుగ రోజు దిశ యాప్పై అవగాహన కల్పించడం ఎంతో ఆనందంగా ఉందని, ఆ యాప్లో ఫిర్యాదు చేస్తే వెంటనే పోలీసులు స్పందిస్తారని ఆయన తెలిపారు. అందువల్ల, రాష్ట్రంలో స్మార్ట్ ఫోన్ ఉండే ప్రతి మహిళ వద్ద దిశ యాప్ ఉండాలని అడవి శేష్ పిలుపునిచ్చారు.