కౌశిక్ ఇంకా ఎమ్మెల్సీ కాలేదు.. రాజ్ భవన్ ఇంకా ఆమోదించలేదు..

కౌశిక్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో ఉండగానే టీఆర్ఎస్ అభ్యర్థిగా హుజూరాబాద్ లో పోటీచేస్తానంటూ మాట్లాడి.. ఆ విషయం బయటకు తెలిసిన అనంతరం కారెక్కిన వ్యక్తి. ఆ తరువాత టీఆర్ఎస్ పార్టీ అతన్నే ఈటలపై పోటీకి దించుతుందని భావించారు. అయితే అందరూ ఆశ్చర్యపోయే విధంగా సీఎం కేసీఆర్ కౌశిక్ ను ఎమ్మెల్సీగా చేయాలని నిర్ణయించారు. పార్టీలో చేరిన ఆరు రోజులకే ఎమ్మెల్సీగా గవర్నర్ కోటాలో నామినేట్ కేబినెట్ నామినేట్ చేసింది. ఆ తరువాత ఫైల్ గవర్నర్ వద్దకు వెళ్లింది. అయితే.. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్.. కేబినెట్ నిర్ణయం రాజ్ భవన్ కు వెళ్లింది కానీ.. ఆ ఫైల్ అక్కడి నుంచి తిరిగి రాలేదు.. కౌశిక్ ఎమ్మెల్సీ కావాలంటే కేబినెట్ నామినేట్ చేస్తే మాత్రమే సరిపోదు.. గవర్నర్ ఆమోదించాలి. మరి.. ఎందుకో గవర్నర్ ఇంకా గెజిట్ విడుదల చేయలేదు. కేబినెట్ మీటింగ్ జరిగి 12 రోజులైంది.. ఆ ఫైల్ రెండు, మూడు రోజుల అనంతరం గవర్నర్ వద్దకు వెళ్లి ఉంటుంది. ఇప్పటి వరకు ఏమైంది అనే విషయం ఎవరికీ అంతుబట్టడం లేదు.

గతంలో గోరటి వెంకన్న ఎమ్మెల్సీ నియామకానికి సంబంధించిన ఫైల్ రాజ్ భవన్ కు వెళ్లిన మరుసటి రోజే ఆమోదం లభించింది. మరి ఇప్పుడు ఏమైందంటే.. సమాధానం లేని ప్రశ్న. ఈ వ్యవహారం సీఎం కేసీఆర్ కు తలనొప్పిగా మారింది. కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ ఆమోదించాల్సిందే.. అయితే అందుకు ఎంత సమయమైనా తీసుకోవచ్చు. అది వారిష్టం. ముఖ్యంగా కౌశిక్ రెడ్డిపై పలు కేసులున్నాయని, అతన్నెలా మండలికి పంపుతారని బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారట. ఆరా తీస్తే .. నిజమే ఆయనపై కేసులున్నాయనే విషయం బయటపడిందట. అందుకే వివాదం ఎందుకని ఈ ఫైల్ అలా పెండింగ్ ఉందని సమాచారం. ఏది ఏమైనా ఈ విషయం ఇపుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆగమేఘాల మీద కౌశిక్ ను ఎమ్మెల్సీగా నియమించాలని కేసీఆర్ నిర్ణయించడమేమిటని ఇతర పార్టీల వాళ్లు కాదు.. సొంత పార్టీ కార్యకర్తలు, నాయకులే అనుకుంటున్నారట. అదే మరి విచిత్రం..