టెస్ట్ పాస్ అయితేనే..గాంధీ భ‌వ‌న్‌లోకి ఎంట్రీ..?!

కాంగ్రెస్ పార్టీలోకి ఎవ్వరైనా రావచ్చు.. ఎప్పుడైనా రావచ్చు.. ఎలా అయినా రావచ్చు.. అనేది ఇన్నాళ్లు ఉన్న అభిప్రాయం. అయితే రేవంత్ టీపీసీసీ పగ్గాలు చేపట్టిన తరువాత ఇది తప్పు అని పార్టీ చెబుతోంది. పార్టీకి వెన్నుపోటు పొడిచి.. ఇబ్బందుల్లో ఉన్నపుడు వెళ్లిపోయి.. అక్కడ సమస్యలు ఎదుర్కొని మళ్లీ సొంతగూటికి రావాలంటే ఇప్పుడు కుదరదని పార్టీ స్పష్టంగా చెబుతోంది.

ఎందుకంటే పార్టీ ఇప్పుడిప్పుడే బలం పుంజుకుంటోంది. అందరినీ పార్టీలోకి తీసుకుంటే ఏం ప్రయోజనం.. ఇక మేమెందుకు అని ఇప్పుడున్న నాయకులు పార్టీ పెద్దలను ప్రశ్నిస్తున్నారట. దీంతో టీపీసీసీ నాయకులు ఓ నిర్ణయం తీసుకున్నారు. పార్టీలోకి వచ్చే వారికి టెస్ట పెడతారట.. అందులో పాస్ అయితేనే గాంధీ భవన్ లోకి ఎంట్రీ అట.. మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి నేతృత్వంలో ఒక కమిటీ వేయాలని పార్టీ నిర్ణయించిందని సమాచారం.

ఆ కమిటీ ఓకే చెప్పిన తరువాతే పార్టీలోకి చేర్చుకుంటారని తెలిసింది. ఎందుకంటే మహబూబ్ నగర్, నిజామాబాద్, భూపాలపల్లి ప్రాంతాలకు చెందిన ఇతర పార్టీ నాయకులు కాంగ్రెస్ లో చేరేందుకు సుముఖంగా ఉన్నారని, అయితే వారి రాకను స్థానిక నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాతెలిసింది. దీంతో ఈ కమిటీ టెస్ట్ చేసి ఓకే చేస్తేనే తీసుకుందాం అనే ఆలోచనలో ఉన్నారు.