ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. ఆ తర్వాత మలయాళ సూపర్ హిట్ లూసిఫర్ రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. మోహన్రాజా దర్శకత్వంలో ఈ రీమేక్ తెరకెక్కబోతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.
ఈ చిత్రంలో సత్యదేవ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రం.. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమాలో హీరో చెల్లెలు క్యారెక్టర్ ఉంటుంది. మలయాళంలో మంజు వారియర్ ఆ పాత్ర పోషించింది. కానీ, తెలుగులో ఎవరు నటిస్తారన్నది మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు.
ఇప్పటికే కీర్తి సురేష్, సాయి పల్లవి, రోజా, విజయశాంతి ఇలా పలువురి పేర్లు వినిపించినా ఎవరూ ఫైనల్ కాలేదు. అయితే తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. ఒకప్పటి హీరోయిన్, కింగ్ నాగార్జున సతీమణి అక్కినేని అమల.. చిరంజీవి చెల్లెలుగా నటించబోతోందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా రానుందని టాక్.