ప్రస్తుతం ఏపీలో వైసీపీ ఎంపీ అయిన రఘురామకృష్ణంరాజు వ్యవహారం ఎంత హాట్ టాపిక్ గాఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు ఈ రెబల్ ఎంపీపై జగన్ సీరియస్ యాక్షన్ తీసుకోనున్నట్టు తెలుస్తోంది. జగన్ పై, పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్న ఎంపీ రఘురామ పేరును వైసీపీ అధికార వెబ్ సైట్ లో తొలగించి తాజాగా షాక్ ఇచ్చారు. అంతే కాదు ఆ పార్టీ ఎంపీల జాబితా నుంచి రఘురామకృష్ణంరాజు పేరును తీసేసారు పార్టీ అధిష్టానం.
రాజ్యసభ, లోక్ సభలో కలిపి వైసీపీకి 28 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నట్టు వారి పేర్లను గతంలో నమోదుచేశారు. కానీ ఇటీవల తిరుపతి నుంచి గెలిచిన డాక్టర్ గురుమూర్తి పేరును ఎంపీల జాబితాలో సవరణ చేసి చేర్చారు. కానీ ఇందులో మాత్రం రఘురామ పేరు కనిపించట్లేదు. కాగా ఈ వ్యవహారంపై అధికార పార్టీ నేతలు ఇంత దాకా స్పందించలేదు. దీనిపై రఘురామ స్పందించారు. జగన్ తనను పార్టీ నుంచి బహిష్కరించారా? అంటూ ప్రశ్నించారు.