ఇండస్ట్రీలో విషాదం.. యువ రచయిత మృతి..!

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. సినీ ప్రముఖులు కూడా కరోనా బారిన పడి ప్రాణాలు వదులుతున్నారు. మరికొందరు కరోనాతో పోరాడి నిలబడుతున్నారు. ఇంకొందరు కరోనాతో పోరాడలేక తనువు చాలిస్తున్నారు. దీంతో రోజుకో విషాద వార్త సీని ఇండస్ట్రీ నుంచి వినాల్సి వస్తోంది. ఇటీవలే ప్రముఖ యాంకర్ టీఎన్ఆర్ కరోనాతో కన్నుమూయగా.. ఆయన మరణవార్త మరిచిపోకముందే టాలీవుడ్‌కు మరో చేదు వార్త అందింది. యువ దర్శకుడు, రచయిత నంద్యాల రవి కరోనాతో కన్నుమూశారు.

ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగా పరిస్థితి విషమించి ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ సినిమాతో నంద్యాల రవి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ‘ఒరేయ్ బుజ్జిగా’ ‘పవర్ ప్లే’ సినిమాలకు రచయితగా పని చేశారు. ఆస్పత్రిలో వైద్య ఖర్చులు రూ.7 లక్షలు అయ్యాయని తెలుసుకున్న కమెడియన్ సప్తగిరి వెంటనే స్పందించి ఇటీవల రూ.లక్ష సాయం చేశాడు. అయినా కొద్దిరోజులకే నంద్యాల రవి ప్రాణాలు వదిలాడు. కాగా నంద్యాల రవి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.