కరోనా సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకు పడుతున్నా.. మనుషులో పైశాచికత్వం పెరుగుతుందే కాని, మానవత్తం పెరగడం లేదు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. కరోనా బారిన పడ్డ ఓ అత్త.. కోడలిపై శాడిజం చూపించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్కు చెందిన ఓ మహిళకు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమారిపేట పరిధిలోని నెమిలిగుట్ట తండా వాసితో మూడేళ్ల క్రితం పెళ్లైంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సదరు మహిళ భర్త ఉపాధి కోసం కొద్ది నెలల క్రితం ఒడిశా వెళ్లగా.. ఆమె పిల్లలతో అత్తింట్లోనే ఉంటుంది. అయితే ఈ మధ్య కరోనా బారిన పడ్డ అత్త.. ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటోంది.
హోం క్వారంటైన్లో ఉంటున్న అత్త..నేను చనిపోతే మీరు హాయిగా బతుకుతారా అంటూ కోడలిపై ద్వేషం పెంచుకుంది. ఈ క్రమంలో కోడలిని ఏదో ఒక వంకతో తరచూ ఆలింగనం చేసుకుంటూ ఆమెకు కూడా కరోనా అంటించింది. అంతేకాదు, కరోనా సోకిన కోడలిని ఇంటి నుంచి బయటకు గెంటేసింది. ఈ విషయం తెలుసుకున్న సోదరి.. ఆమెను తన ఇంటికి తీసుకువెళ్లి హోం క్వారంటైన్లో ఉంచి చికిత్స అందిస్తోంది. ఇక ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై సదరు మహిళ కుటుంబసభ్యులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ అత్తపై కఠన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించారు.