రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. అశ్రద్ధ, అజాగ్రత్తతో నిండు ప్రాణాలను కోల్పోతున్నారు. ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. అవి కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ నగర శివార్లలోని అబ్దుల్లాపూర్మేట్ వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న ఓ లారీని స్విఫ్ట్ కారు ఢీకొనగా ఈ ప్రమాదంలో కారులో సుల్తాన్ బజార్ సీఐ లక్ష్మణ్, ఆయన సతీమణి ఝాన్సీ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అధికారులు తెలిపిన కథనం ప్రకారం..
సూర్యాపేట జిల్లా నుంచి సీఐ దంపతులు తమ ఏడేళ్ల కుమారుడితో కలిసి స్విష్ట్ కారులో హైదరాబాద్కు శుక్రవారం రాత్రి బయలుదేరారు. కారును సీఐ భార్య ఝన్సీ నడుపుతుండగా, సీఐ పక్క సీటులో కూర్చున్నాడు. ఇదిలా ఉండగా జాతీయ రహదారి 65 మీదుగా వారు అబ్దుల్లాపూర్మెట్కు చేరుకున్నాడు. అక్కడ రోడ్డు సమీపంలో నిలిపి ఉంచిన లారీని వెనకనుండి వేగంగా వారి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కాగా సీఐ లక్ష్మణ్ (39), ఆయన భార్య జాన్సీ (34) అక్కడికక్కడే మృతి చెందాడు. వారి కుమారుడు కుశాలవ్ ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదం విషయం తెలియగానే పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సీఐ బంధువులకు సమాచారం అందజేసి మృతదేహాలను పోస్ట్మార్టమ్కు తరలించినట్లు మీర్పేట్ ఇన్స్పెక్టర్ వెల్లడించారు.