ఇప్పుడున్న కరోనా ప్రమాదకర పరిస్థితుల్లో అందరి చూపు ఆనందయ్య మందుపైనే ఉంది. ఈ మందు వార్తల్లోకి ఎక్కినప్పటి నుంచి అనేక రకాలుగా దీనిపై చర్చ జరుగుతోంది. ఒకానొక దశలో దీన్ని అల్లోపతి వర్సెస్ ఆయుర్వేదం అన్నట్టు సృష్టించారు. అయితే విపరీతంగా జనాలు రావడంతో దీని పంపిణీని నిలిపివేసింది ప్రభత్వం. ఇక అప్పటి నుంచి దీన్ని ఎప్పుడు పంచుతారా అని అందరూ ఎదురు చూస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం ఐసీఎంఆర్ టీమ్ను కూడా పంపింది. ఇప్పటికే ఆయుష్ అధికారులు కూడా వెళ్లి దీంట్లో ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేసింది. అయితే ఐసీఎంఆర్ నుంచి పూర్తిస్థాయి నివేదిక వచ్చే వరకు పంపిణీ చేయొద్దంటూ ఏపీ సర్కార్ ఆదేశించింది. అయితే ఈ క్రమంలో నాటుమందు పంపిణీ గురించి జోరుగా చర్చ జరుగుతోంది.
దీంతో మందుపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కృష్ణపట్నం ఆనందయ్య స్పందించారు. తన మందుకు ఇంకా అనుమతులు రాలేదని తెలిపారు. తన మందు పంపిణీ చేసే తేదీలపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించారు. తన దగ్గర మాత్రమే ఆమందు ఉంటుందని, బయట ఎవరైనా అమ్మితే కొనవద్దంటూ విజ్ఞప్తి చేశారు. కాగా ప్రస్తుతం మందు తయారీకి అవసరమైన ఆకులు, దినుసులు రెడీగా లేవని స్పష్టం చేశారు.
తన మందుపై వస్తున్న వదంతులు నమ్మి కృష్ణపట్నం గ్రామానికి దయచేసి ఎవరూ రావొద్దంటూ వేడుకున్నారు. ఇక ఇదిలా ఉంటే ఆయుష్ అధికారులు దీంతో ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడంతో ప్రజల్లో డిమాండ్ బాగా పెరిగిపోయింది. అయితే ఇటీవల కాలంలో ఈమందు వాడిన కొందరు ఆస్పత్రుల్లో జాయిన్ అవుతున్నారంటూ మరికొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. కాగా ఇలాంటి వార్తలపై ఆనందయ్య ఎలాంటి స్పందన చేయలేదు. కానీ ఆనందయ్య మందు కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. త్వరగా పంపిణీచేయాలంటూ కోరుతున్నారు. లేదంటే చాలామంది ప్రాణాలు కోల్పోతారంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక ఐసీఎంఆర్ టీమ్ ఇచ్చే తుది నివేదికపైనే ఆనందయ్య మందు పంపిణీ ఆధారపడి ఉంటుంది.