కరోనా వైరస్ పంజా విసురుతోంది. విలయతాండవం చేస్తున్నది. సుడిగాలిలా వ్యాపిస్తూ వేలాది మంది ప్రాణాలను బలిగొంటున్నది. దీంతో అడుగు బయటపెట్టాలంటేనే జనం జంకుతున్నది. ఈ మరోవైపు తెలంగాణ ప్రభుత్వం సైతం వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. నైట్కర్ఫ్యూ అమలు చేస్తున్నది. అయినప్పటికీ అందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకున్నది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం యథాతధంగా నిర్వహించనున్న ప్రకటించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 30న ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులు లేవని, కొవిడ్ జాగ్రత్తలతో ఎన్నికలు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తామని ఎస్ఈసీకి అధికారులు తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వానికి ఎస్ఈసీ లేఖ రాయడం గమనార్హం.
ఈ నెల 30న వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు ఐదు మున్సిపాలిటీలకు పోలింగ్ నిర్వహించాల్సి ఉంది. అయితే నైట్ కర్ఫ్యూ అమల్లోకి రావటంతో.. పురపోరు జరుగుతుందా? లేదా ? అనే చర్చ మొదలైంది. ఎన్నికలు వాయిదా వేయాలని ఇప్పటికే కొంతమంది కోర్టుని ఆశ్రయించారు. అయితే, ఈ దశలో ఎన్నికలు ఆపమని ఆదేశాలివ్వలేమని హైకోర్టు చెప్పడంతో కొంతమేర అడ్డంకి తొలగిపోయింది. మరోవైపు
స్వయానా రాష్ట్ర సీఎం కేసీఆర్ కోవిడ్ లక్షణాలతో విశ్రాంతి తీసుకోడం పురపాలక ఎన్నికల్లో ప్రచార జోష్ తగ్గింది. నాయకులు సభలు, రోడ్షోల జోలికెళ్లటం లేదు. ఓ పక్క ప్రభుత్వ కార్యాలయాలకు, చివరికి ఎన్నికల కమిషన్ ఆఫీస్కి వెళ్లాలన్న కోవిడ్ నేపథ్యంలో అనేక నిబంధనలు పెడుతున్నారు. కాంగ్రెస్, టీజేఏస్ ఎన్నికలను వాయిదా వేయాలని ఇప్పటికే ఎస్ ఈసీని కోరాయి. అయితే ఎన్నికల నిర్వహణకే అధికారపార్టీ మొగ్గుచూపుతోంది. కరోనా కాలంలో ఎన్నికల నిర్వహణపై సామాన్యుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండడం విశేషం.