జాతీయ స్థాయిలో గురింపు తెచ్చుకున్న స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈయన రోబో 2.0 తర్వాత కమల్ హాసన్తో భారతీయుడు సినిమాకు సీక్వెల్గా ‘ఇండియన్ 2’ ను స్టార్ట్ చేసాడు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తుంది. కొంత షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.
అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి కూడా ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంది. ఈ క్రమంలోనే కరోనాకు ముందే ఇండియన్ 2 షూటింగ్ చిత్రం నిలిచిపోయింది. దీంతో శంకర్ ఇతర చిత్రాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా లైకా ప్రొడక్షన్స్ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇండియన్ 2ను పూర్తి చేయకుండా మరో సినిమాకు మూవ్ అయిపోవడంపై అసహనం వ్యక్తం చేస్తూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్ వాళ్లు తమ పిటిషన్లో కొన్ని కీలకమైన విషయాలు పేర్కొన్నారు. ఇప్పటికే ఇండియన్ 2 కోసం 180 కోట్ల రూపాయాల వరకూ ఖర్చు పెట్టామని, తమ మధ్య డీల్ ప్రకారం మరో 50 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని, అలాగే శంకర్ కు 40 కోట్ల రూపాయల పారితోషికాన్ని ఇచ్చినట్లు తెలిపారు. తమ సినిమాను పూర్తి చేసేలా చూడమని కోర్టును కోరుతున్నారు. దీంతో శంకర్ రెమ్యునరేషన్ ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్గా మారింది.