బెంగుళూరులో డ్రగ్స్ కలకలం రేపిన సంగతి అందరికి తెలిసందే. ఇక బెంగుళూరులో తీగ లాగితే హైద్రాబాద్ లో డొంక కదులుతుంది. కొద్దిరోజుల క్రితం పట్టుబడ్డ నైజీరియన్స్ను బెంగుళూరు పోలీసులు విచారించగా.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కన్నడ నిర్మాత శంకర్ గౌడ్ తో కలిసి కలహర్ రెడ్డి, సందీప్ ఈ డ్రగ్స్ కొనసాగించినట్లు తెలుస్తోంది.
అయితే కలహార్ రెడ్డి తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులకు, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులకు పార్టీలు ఇచ్చినట్లు సందీప్ వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీల్లో పాల్గొన్నారని, వారు సైతం డ్రగ్స్ తీసుకున్నారని సందీప్ పేర్కొన్నారు. ఓ ఎమ్మెల్యే కోరిక మేరకు పలుమార్లు కొకైన్ పంపినట్టు సందీప్ పోలీసుల విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా తెలంగాణలో చాలా మంది ప్రముఖులకు రెగ్యూలర్గా సప్లై చేస్తామని, తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులంతా కలిసి పార్టీలు చేసుకుంటారని తెలిపినట్లు ప్రచారం జరుగుతుంది. కలహర్ రెడ్డి, శంకర్ గౌడ్ తో పాటు తెలంగాణకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను కూడా బెంగళూరు పోలీసులు త్వరలోనే ప్రశ్నించనున్నారు. వీరికి త్వరలోనే నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.