మ‌ళ్లీ అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైన సీనియ‌ర్ న‌టుడు!

కోలీవుడ్‌ సీనియ‌ర్ న‌టుడు కార్తీక్ మ‌ళ్లీ ఆస్వ‌స్థ‌త‌కు గురై ఆసుప‌త్రి పాల‌య్యారు. త‌మిళంలో ఎన్నో చిత్రాలు చేసిన కార్తీక్.. సీతాకోకచిలుక, అన్వేషణ, అభినందన వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. ‌

తెలుగు, త‌మిళ సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన ఈయ‌న‌.. అనూహ్యంగా రాజకీయ రంగప్రవేశం చేసి మనిద ఉరిమై కట్చి (మానవ హక్కుల పార్టీ) అనే సొంత పార్టీని కూడా స్థాపించారు. అయితే కొంత కాలాన్ని పార్టీని ర‌ద్దు చేసి.. తన మద్దతును అన్నాడీఎంకే–బీజేపీ కూటమికి ప్రకటించారు.

అంతేకాదు, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భాగంగా జోరుగా ప్ర‌చారాలు కూడా చేశారు. ఈ క్ర‌మంలోనే సోమవారం సాయంత్రం ప్రచారం ముగించుకుని ఇంటికి చేరుకున్న కార్తీక్‌ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబ‌స‌భ్యులు ఆయ‌ను వెంట‌నే అడయార్‌లోని ప్రైవేట్‌ హాస్పిటల్లో జాయిన్ చేయ‌గా.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా, గత నెల 21న కూడా అనారోగ్యానికి గురై చెన్నై హాస్ప‌ట‌ల్‌లో చేరిన సంగ‌తి తెలిసిందే.