సౌత్ ఇండియా పాలిటిక్స్కు సినిమా వాళ్లకు చాలా అవినాభావ సంబంధం ఉంది. సినిమా పరిశ్రమలో స్టార్లుగా ఉన్నవారు పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చి ఏకంగా సీఎంలు అయ్యారు. తమిళనాడులో ఎమ్జీఆర్, ఏపీలో ఎన్టీఆర్ అగ్రహీరోలుగా ఎదిగి తర్వాత రాజకీయ పార్టీలు పెట్టి ఏకంగా సీఎంలు అయ్యారు. తర్వాత ఎమ్జీఆర్ వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన జయలలిత సీఎం అయ్యి తమిళనాడును శాసించారు.
ఎమ్జీఆర్, ఎన్టీఆర్ తర్వాత హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చినా వీరి రేంజ్లో మాత్రం సక్సెస్ కాలేదు. తమిళనాడులో మాత్రం జయలలిత సీఎం అయ్యారు. ఇక ఆంధ్రాలో ఎన్టీఆర్ స్థాయిలో ఎవ్వరూ పేరు తెచ్చుకోలేదు. ఎన్టీఆర్ తరువాత సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి. వంటి స్టార్ హీరోలు విజయశాంతి, జయప్రద, జయసుధ, రోజా వంటి హీరోయిన్స్ తో పాటు నటులుగా రాణించిన వారు కూడా రాష్ట్ర రాజకీయాల్లో ప్రవేశించి వారి సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేశారు.
ఇక వచ్చే ఎన్నికల్లో ఏపీలో మరోసారి స్టార్ వార్ జరిగేలా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పవర్స్టార్ పవన్కళ్యాణ్ జనసేన పార్టీ ఫస్ట్ టైం పోటీ చేస్తోంది. పవన్ ప్రభావం ఏపీలో చాలా గట్టిగా ఉండనుంది. ఇక టీడీపీలో ఇప్పటికే బాలయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక ప్రజారాజ్యం పార్టీతో ప్లాప్ షో వేసి తర్వాత కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేసిన చిరు వచ్చే ఎన్నికల నాటికి వైసీపీలో లేదా మరో పార్టీలో చేరతారని టాక్.
ఇక టాలీవుడ్ మన్మథుడు నాగార్జున వైసీపీలో చేరి గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేస్తారని వార్తలొస్తున్నాయి. ఇక రోజా నగరి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక పవన్ అనంతపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు. ఇక నాగబాబు జనసేన నుంచి కాకినాడ ఎంపీగా పోటీ చేస్తారని జనసేన వర్గాల ద్వారా టాక్ లీక్ అయ్యింది.
ఇక హీరో శివాజీ పేరు గుంటూరు నుంచి లోక్సభకు వినపడుతోంది. ఇక మహేశ్ బాబు బావ గుంటూరు ఎంపీగా ఉండగా వచ్చే ఎన్నికల్లో మహేశ్ ఇన్ డైరెక్టుగా టీడీపీకి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారని సమాచారం. ఇలా టాలీవుడ్ స్టార్స్ అందరూ ఏపీలో ప్రధాన పార్టీల నుంచి వచ్చే ఎన్నికల బరిలో ఉండడమో లేదా ప్రచారం చేయడమో చేసేందుకు రెడీ అవుతుండడంతో ఏపీలో 2019 ఎన్నికలు సినీ స్టార్స్ మధ్య వార్లా మారాయి.