తనపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు బడ్జెట్ రూపంలో సమాధానమిచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్! తన వ్యూహాలకు తిరుగులేదని, తనతో పెట్టుకుంటే ఎవరైనా చిత్తు కావాల్సిందేనని మరోసారి రుజువుచేశారు. అంతేగాక కాంగ్రెస్ను మళ్లీ మాట్లాడకుండా చేశారు. దీంతో ఆ పార్టీ నేతలు సందిగ్ధ స్థితిలో పడిపోయారు! ఇప్పటికే అన్ని వర్గాలపై పట్టు సాధించిన కేసీఆర్.. ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీలకే పెద్ద పీటే వేశారు. దీంతో ఇప్పటివరకూ బీసీలకు అన్యాయం జరుగుతోందని విమర్శిస్తున్న కాంగ్రెస్ నేతలకు.. చెక్ చెప్పారు.
తెలంగాణలో కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. నేతలంతా విభేదాలు పక్కన పెట్టి పార్టీని తిరిగి గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో సంస్థాగతంగా ఉన్న సమస్యల్ని అధిగమిస్తూనే.. కేసీఆర్ సర్కారుపై బాగానే పోరాటం మొదలుపెట్టారు. ప్రాజెక్టుల్లో చోటు చేసుకుంటున్న అవినీతిపాటు, నిరుద్యోగ సమస్య, రైతుల పరిస్థితిపై బాగానే పోరు పెంచుతోంది. అయితే, ఈ పోరాటానికి బడ్జెట్ ద్వారా చెక్ పెట్టేశారు కేసీఆర్. తెరాసను ఎలాగైనా ఇరుకున పెడదామని భావించిన కాంగ్రెస్.. ఇప్పుడు అడ్డంగా ఇరుక్కుపోయింది.
బడ్జెట్లో బీసీలపై వరాల జల్లులు కురిపించింది టీఆర్ఎస్ ప్రభుత్వం! వీటిపై విమర్శలు చేస్తే బీసీల్లో కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత రావడం సహజం! విశ్లేషణ చేస్తే మరో సమస్య అన్నట్టుగా మారింది కాంగ్రెస్ పరిస్థితి. తొలి రోజు నుంచే.. అసెంబ్లీపై పూర్తి పట్టు సాధించారు కేసీఆర్. తనపై విరుచుకపడే రేవంత్రెడ్డిని మొదటి రోజు సస్పెండ్ చేశారు. దీంతో ఇక టీఆర్ఎస్ దుమ్ము దులిపేయొచ్చు అని కాంగ్రెస్ నేతలు భావించారు. కానీ ఆ పప్పులేమీ కేసీఆర్ ముందు ఉడకలేదు.
గతంలో కాంగ్రెస్ హయాంలోనూ వారికి నిధులు దక్కేవి. అయితే, ఈసారి కేటాయింపుల్ని తన రాజకీయ ప్రయోజనా లకు అనుగుణంగా కేసీఆర్ మలచుకున్నారు. ఈ పరిస్థితిపై విమర్శించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ధైర్యం చేయలేకపోతున్నారు. బర్రెలు, గొర్రెలు, యాదవులు, నాయీలు.. ఇలా వివిధ సామాజిక వర్గాలకు చెందిన సున్నితాంశాలు ఇందులో ముడిపడి ఉండటంతో కాంగ్రెస్ నోరెత్తలేకపోతోందని చెప్పుకోవాలి.బడ్జెట్ను రాజకీయ కోణం నుంచి తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నించలేకపోతోంది. మొత్తానికి ఎన్నో ఆశలతో అసెంబ్లీలో అడుగుపెట్టిన కాంగ్రెస్ నేతలను ఉసూరుమనిపించారు కేసీఆర్!!