తమిళనాడుపై పట్టు సాధించాలనే ఆశ బీజేపీలో ఇంకా కనిపిస్తూనే ఉంది. మాజీ సీఎం దివంగత జయలలిత మరణం తర్వాత.. ఆమె విధేయుడైన పన్నీర్ సెల్వానికి మద్దతు ఇచ్చి ఎన్నో ఆటలు ఆడించింది. ఆయన్ను ముందుంచి వెనుక నుంచి చక్రం తిప్పుదామని కలలుగంది. చివరకు సీఎం పీఠం ఎక్కుదామని భంగపడిన శశికళ వర్గానికే సీఎం కుర్చీ దక్కింది. దీంతో ఎలాగైనా దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలన్న ఆశ ఆవిరైంది. అయితే ఇప్పుడు చేరికలను ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరాన్ని పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందట.
కాంగ్రెస్ నేత చిదంబరం ఏంటి.. బీజేపీలో చేరడమేంటి? అని ఆశ్చర్యపోతున్నారా!! కరుడు గట్టిన కాంగ్రెస్ వాదిగా ఉన్న చిదంబరం.. ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న! భారతీయ జనతా పార్టీ తీరు చూస్తే ఆయననూ చేర్చుకోవడానికి వెనుకాడేలా లేదు. అనైతిక, అవినీతి వ్యవహారాల్లో భాగస్వామ్యులైన వారికి భారతీయ జనతాపార్టీ చేదోడువాదోడుగా ఉండటం ఇప్పుడు జరుగుతున్నదే. కాంగ్రెస్ అవినీతిపై దుమ్మెత్తిపోస్తూ అధికారంలోకి వచ్చిన బీజేపీ.. క్రమంగా కాంగ్రెస్ తీరును అలవాటు చేసుకుని ముందుకుపోతోంది. అలాగే కాంగ్రెస్ వ్యక్తులు కూడా బీజేపీకి క్రమక్రమంగా దగ్గరవుతున్నారట.
యూపీ ఎన్నికల అనంతరం.. దక్షిణాదిన బలపడాలనే లక్ష్యాన్ని పెట్టుకుని.. ప్రత్యేకించి అందుకు తమిళనాడులో వ్యాక్యూమ్ ఉందని భావిస్తున్న కమలంపార్టీ.. అక్కడ చేరికలకు ప్రాధాన్యతను ఇవ్వాలని భావిస్తోందట. అందులో భాగంగా జాతీయ స్థాయిలో పేరున్న కొందరు తమిళ నేతలను చేరదీయాలని అనుకుంటోందట. ఈ జాబితాలో ది గ్రేట్ చిదంబరం ఉన్నారని సమాచారం. ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయన.. కాంగ్రెస్ రాజకీయాల్లో అడపాదడపా కనిపిస్తున్నారు. పార్టీకి కూడా కొద్దిగా దూరంగానే ఉంటున్నారు. ఈ సమయంలో ఆయన్ను బీజేపీ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందట.
మరి చిదంబరాన్ని బీజేపీ ఎన్ని మాటలు అంది? ఆయన అవినీతి గురించి కమలనాథులు ఎన్ని ఆరోపణలు చేశారు.. కార్తీ చిదంబరంపై ఎన్ని కేసులు వేశారు.. ప్రస్తుతం అవి ఏ దశలో ఉన్నాయి.. అనే ప్రశ్నలేవీ ఇప్పుడు లెక్కలోకి రావట్లేదు. బీజేపీ చూపు పడితే నీతిమంతులు అవుతారు. అదీ లెక్క. దాని ప్రకారమే చిద్దూ త్వరలోనే కమలంపార్టీ తీర్థం పుచ్చుకోవడం జరుగుతుందట. ఆ పార్టీ టార్గెట్ కేవలం సీట్లు, అధికారం మాత్రమే. దాని కోసం చిదంబరాన్ని చేర్చుకోవడంలో ఏ మాత్రం వింతేమీ లేదు!