తెలుగు రాష్ట్రంలో చెలరేగిపోయి.. అటు పొలిటీషియన్లని, ఇటు కాంట్రాక్టర్లని ముప్పుతిప్పలు పెట్టిన గ్యాంగ్స్టర్ నయీం హతమయ్యాడు. కానీ, అతను సృష్టించిన నేరసామ్రాజ్యం మాత్రం ఇంకా కొనసాగుతోంది. ఇక, ఈ నేరసామ్రాజ్యాన్ని ఆసరాగా చేసుకుని నయీం సంపాదించిన ఆస్తులపై ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నయీం కూడబెట్టిన మొత్తం ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ రూ. 143 కోట్లట! ఈ విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు.
ప్రస్తుతం శీతాకాల సమావేశాలు జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీలో సోమవారం నయీం దందాలు, అతని మరణంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా నయీంకు సంబంధించిన అధికారిక డేటాను సీఎం కేసీఆరే స్వయంగా సభలో వివరించారు. కేసీఆర్ చెప్పిన విషయాన్ని బట్టి.. మొత్తం 27 హత్య కేసుల్లో నయీం పాత్రను పోలీసులు గుర్తించారు. మరో 25 కేసుల్లో అతడి ముఠా పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఆగస్టు 8వ తేదీన నయీం ఎన్కౌంటర్ తర్వాత స్వాధీనం చేసుకున్న కీలక డైరీ ఆధారంగా దర్యాప్తు చేసినట్టు సీఎం తెలిపారు.
నయీం కేసుపై సిట్ను నియమించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు మొత్తం 174 కేసులు నమోదయ్యాయని, 741 మంది సాక్షులను విచారించి 124 మందిని అరెస్టు చేసినట్టు కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో నయీం ముఠాకు సంబంధించిన స్థావరాలలో పోలీసులు సోదాలు చేశారని తెలిపారు. మొత్తం 2.95 కోట్ల నగదు, 21 కార్లు, 21 తుపాకులు, 26 బైకులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు.
నయీం బంధువుల పేరు మీద ఉన్న దాదాపు 1015 ఎకరాల భూమిని, లక్షా 67వేల చదరపు గజాల విస్తీర్ణం గల ఇళ్ల స్థలాల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారన్నారు. నయీం కేసులో ఇప్పటికే రెండు చార్జిషీట్లు దాఖలు చేశారని, త్వరలో మరో 15 చార్జిషీట్లు దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారని చెప్పారు.