సిటిలో మరో రెండు పెద్ద స్కైవేలు రాబోతున్నాయి. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్యారడైజ్ నుంచి ఔటర్ రోడ్డు వరకు, ఉప్పల్ నుంచి ఘట్ కేసర్ వరకు స్కైవేలను నిర్మించనున్నారు. వీటి నిర్మాణం కోసం 110 హెక్టార్ల భూమి అవసరమని ప్రతిపాదనలు రెడీ చేశారు అధికారులు. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్టు, హైవేస్ అనుమతి కోసం వెయిట్ చేస్తున్నారు. పర్మిషన్ రాగానే ఉప్పల్ ఘట్ కేసర్ స్కైవేకు ప్రణాళికలు సిద్ధం చేస్తారు.
ప్యారడైజ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు.. 10.8 కిలోమీటర్ల స్కైవేను 60మీటర్ల వెడల్పుతో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. ఉప్పల్ నుంచి ఘట్ కేసర్ వరకు నిర్మించే 18 కిలో మీటర్ల స్కైవేను 50 మీటర్ల వెడల్పుతో నిర్మించాలని ప్రపోజల్స్ రెడీ చేశారు. అయితే ప్యారడైజ్ దగ్గర నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ 6.4 కిలో మీటర్లు, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ 7కిలో మీటర్లుగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
ప్యారడైజ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు స్కైవేకు 2వేల 423కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ ప్రాజెక్టుకు 72.93 హెక్టార్ల భూసేకరణ కోసం.. 910కోట్లు అవసరమని భావిస్తున్నారు. భవనాల నష్టపరిహారం కోసం 132 కోట్లు, స్కైవే నిర్మాణానికి 1,381 కోట్లు ఖర్చవుతాయని ప్రతిపాదనలు సిద్ధం చేశారు అధికారులు. అయితే ఈ స్కైవే వెళ్లే రూట్ లో 26.55 హెక్టార్ల డిఫెన్స్ భూమి ఉంది. ఆ భూములపై ఇప్పటికే కేంద్ర రక్షణశాఖకు లేఖ రాశారు రాష్ట్ర సీఎస్. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల జాయింట్ కమిటీ ఆ భూములు కూడా పరిశీలించింది.
ఇక ఉప్పల్ స్కైవే అనుమతుల కోసం ఎదురుచూస్తోంది జీహెచ్ఎంసీ. ఉప్పల్ స్కైవేకు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్టు, హైవేస్ అనుమతులు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే ప్రైమరీగా ఒక అంచనాకు వచ్చారు అధికారులు. ఈ ప్రాజెక్టు కోసం 36.48 హెక్టార్ల భూసేకరణ అవసరమని అంచనా వేస్తున్నారు. అనుమతులు వచ్చిన వెంటనే.. ఖర్చు అంచనా వేస్తారు. స్కైవేలు 6 లేన్లా లేదా 4 లేన్లా అనేది ఇంకా డిసైడ్ కాలేదు.
కేంద్రం అనుమతులు రాగానే డీపీఆర్ కంప్లీట్ చేసి టెండర్లు పిలుస్తారు. బడ్జెట్ ఎంత వరకు సరిపోతుందనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. దీంతో పాటు ఈ ప్రాజెక్టు కోసం బల్దియా సొంత డబ్బు ఖర్చు పెడుతుందా లేక అప్పుల కోసం ఆర్ధిక సంస్థలను అప్రోచ్ అవుతుందా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.